నిజామాబాద్/ వరంగల్, జూన్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రజలకు మరింత వేగంగా సేవలు అందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల్లో నిర్మిస్తున్న సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనాలు సకల వసతులతో సిద్ధమవుతున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి, వరంగల్ అర్బన్ జిల్లాల్లో కలెక్టరేట్ల భవన నిర్మాణాలు పూర్తికాగా తుది మెరుగులు దిద్దుతున్నారు. కామారెడ్డి జిల్లాలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా చేపడుతున్న జిల్లా పోలీస్ భవన నిర్మాణం కూడా పూర్తి కావొచ్చింది. ఒక్కో కలెక్టరేట్ నిర్మాణానికి ప్రభుత్వం దాదాపు రూ.60 కోట్లు వెచ్చించిం ది. త్వరలోనే ఈ భవనాలను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.