హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): హైకోర్టు ఆవరణలో న్యాయవాదుల కోసం లా చాంబర్స్ భవనం, పిల్లల సంరక్షణ కేంద్రం (చైల్డ్కేర్ సెంటర్), అత్యవసర వైద్య సేవల కోసం డిస్పెన్సరీ భవనాల నిర్మాణాలకు బుధవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ శంకుస్థాపన చేశారు. ఈ భవనాల నిర్మాణాల కోసం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.14.87 కోట్లకు పరిపాలనాపరమైన అనుమతి మంజూరు చేసింది. న్యాయవాదులకు 50 లా చాంబర్స్ కోసం సిల్ట్ ప్లస్ మూడు అంతస్తుల్లో భవనాన్ని నిర్మిస్తారు. మీటింగ్ హాల్, ఇతర మౌలిక వసతులు కల్పించనున్నారు. ఈ భవన నిర్మాణానికి రూ.12.33 కోట్లు, చైల్డ్కేర్ సెంటర్ భవన నిర్మాణానికి రూ.1.27 కోట్లు, హైకోర్టు డిస్పెన్సరీ భవనానికి రూ.1.27 కోట్లు కేటాయించారు. డాక్టర్స్, స్టాఫ్తోపాటు వైద్యపరీక్షలకు, వెయిటింగ్ హాల్స్ నిర్మాణాలకు సీజే శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయ, ఆర్థిక, వైద్యారోగ్య శాఖల కార్యదర్శులు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కమిషనర్, ఆర్ అండ్ బీ ఇంజినీర్ ఇన్ చీఫ్ హాజరయ్యారు.