తుర్కపల్లి, జూన్ 25: త్వరలో వాసాలమర్రి గ్రామ రూపురేఖలు మారనున్నాయని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలాసత్పతి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రిలో కలెక్టర్ ఆధ్వర్యంలో శుక్రవారం గ్రామ అభివృద్ధి కమిటీలను ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వాసాలమర్రిని సీఎం కేసీఆర్ దత్తత తీసుకోవడం గ్రామస్థుల అదృష్టమన్నారు. గ్రామ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎన్ని నిధులైన ఖర్చుచేసేందుకు సిద్ధ్దంగా ఉన్నారని చెప్పారు. అనంతరం గ్రామాభివృద్ధి కోసం ప్రధాన కమిటీతోపాటు హరితహారం, పారిశుద్ధ్యం-తాగునీరు, శ్రమదానం, ఆరోగ్యం, వ్యవసాయం, మౌలిక వసతులు, మార్కెటింగ్ కమిటీలను ఏర్పాటు చేశారు. అభివృద్ధి కమిటీల సభ్యులు నిస్వార్థంగా సేవ చేయాలని కోరారు. ఈ సమావేశంలో డీఆర్డీవో ఉపేందర్రెడ్డి, సర్పంచ్ పోగుల ఆంజనేయులు, ఎంపీటీసీ సభ్యుడు పలుగుల నవీన్కుమార్ తదితరులు పాల్గొన్నారు.