యాదాద్రి: శ్రావణ మాసం ప్రారంభాన్ని పురస్కరించుకుని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సోమవారం నుంచి స్వామి, అమ్మవార్లను ఆరాదిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధానార్చకుడు మోహనాచార్యు లు తెలిపారు. శ్రావణ మాసంలో ఆండాళ్ అమ్మవారి తిరునక్షత్రోత్సవం, నాగపంచమి, స్వాతీ నక్షత్రోత్సవం నిర్వహించను న్నారు. ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు స్వామివారి పవిత్రోత్సవాలను వైభవంగా జరుపనున్నట్లు వివరించారు.
రెండు ఏకాదశి పర్వదినాలు, వరలక్ష్మీ వత్రం, శ్రీహయగ్రీవ జయంతి, యుజర్వేదీనాముపాకర్మ రాఖీపూర్ణిమ వంటి పూజాదులు నిర్వహిస్తామన్నారు. శ్రావణమాసంలో వచ్చే ప్రతి సోమవారానికి ఎంతో విశిష్టత ఉంటుందన్నారు. ముక్తి ప్రధాత ముక్కంటికి సోమవారం ప్రీతికరమైంది. ఈ రోజున స్వామిని పూజించినంతనే స్వామి కటాక్షం పొందవచ్చునని పురాణాలు చెబుతున్నాయి. లింగ స్వరూపుడైన ఆ దేవుడిని అభిషేకాలు, అర్చనలతో నమస్కరిస్తే శుభాలు కలిగి సకల పాపాలు తొలుగుతాయి. ఈసారి శ్రావణమాసం సోమవారం ప్రారంభం కావడంతో శుభ ప్రదమని పురోహితులు చెబుతున్నారు.
వ్రతాలకు ప్రత్యేక ఏర్పాట్లు..
శ్రావణమాసం అంటేనే ఆధ్యాత్మిక మాసంమని చెప్పొచ్చు. వ్రతాలకు పూజలకు పేరొందింది. శ్రావణ మాసంలో సత్యనారాయణస్వామి, వరలక్ష్మి, మంగళగౌరీ, గోపూజల లాంటి వ్రతాలు, పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్నవరం అనంతరం సత్యనారాయణ వ్రతాలు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోనే పెద్ద ఎత్తున జరుగుతాయి. ప్రత్యేకించి శ్రావణ, కార్తీక మాసాల్లో భక్తులు యాదాద్రీశుడి సన్నిధిలో వ్రతమాచరిస్తారు.
ఈ నేపథ్యంలో వ్రతాల ఏర్పాట్లపై ఆలయ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించారు. పాత గోశాల వద్ద నూతనంగా నిర్మించిన వసతి గృహంలో సత్యనారాయణ స్వామి వ్రతమండపాలను ఏర్పాటు చేశారు. రెండు హాళ్లలో ప్రత్యేకించి వ్రత పీటలు అందుబాటులో ఉంచారు. వ్రతాల్లో పాల్గొనే భక్తులకు కావాల్సిన సామాగ్రిని మండపాల వద్దకు తరలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగుకుండా ప్రత్యేక ఏర్పాటు చేశారు.