న్యూఢిల్లీ: యావత్ భారతదేశం కరోనా మహమ్మారితో సతమవుతున్నది. రోగుల సంఖ్య రోజురోజుకు కుప్పలు తెప్పలుగా పెరిగిపోతున్నది. దాంతో దేశంలో మెడికల్ ఆక్సిజన్కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఈ కారణంగా బాధితుల సంఖ్యతోపాటే ఆక్సిజన్ కొరత కూడా పెరిగిపోతున్నది. అందువల్ల అవసరమున్న వారికి మాత్రమే ఆక్సిజన్ అందిస్తే వృథాను అరికట్టే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో కృత్రిమ శ్వాస ఎవరికి అవసరం, ఎవరికి అసవరం లేదు అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం డాక్టర్లు ఒక నడక పరీక్షను సూచిస్తున్నారు.
కరోనా వైరస్ బారినపడి హోమ్ క్వారెంటైన్లో ఉన్నవాళ్లు, కరోనా సోకిందేమోనన్న అనుమానం ఉన్నవాళ్లు కేవలం ఆరు నిమిషాల నడక ద్వారా తమలోని ఆక్సిజన్ సంతృప్తతను తెలుసుకోవచ్చని చెబుతున్నారు. మహారాష్ట్ర ఆరోగ్యశాఖ కూడా రాష్ట్ర పౌరులు తమ ఊపిరితిత్తుల పనితీరును 6 నిమిషాల నడక పరీక్ష ద్వారా తెలుసుకోవాలని సలహా ఇస్తున్నది.
కరోనా పాజిటివ్ వచ్చి హోమ్ ఐసోలేషన్లో ఉన్నవాళ్లు తప్పనిసరిగా రోజుకు రెండు లేదా మూడు సార్లు ఆరు నిమిషాల నడక పరీక్ష ద్వారా తమలో ఆక్సిజన్ స్థాయిలను పరిశీలించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అంతేగాక ఈ ఆరు నిమిషాల కొవిడ్ పరీక్ష ఎలా నిర్వహించుకోవాలి..? ఆక్సిజన్ స్థాయిలను ఎలా కొలుచుకోవాలి..? అనే అంశాలను కూడా వైద్యులు వివరిస్తున్నారు.
ఆరునిమిషాల నడక పరీక్ష అంటే..?
కరోనా బాధితులు, అనుమానితులు తమలో ఆక్సిజన్ స్థాయిలను తెలుసుకోవడానికి నిర్వహించుకునే పరీక్షే ఆరు నిమిషాల నడక పరీక్ష. ఈ పరీక్షను ఎలా నిర్వహించుకోవాలంటే బాధితులు ముందుగా పల్స్ ఆక్సీమీటర్ ద్వారా తమలో ఆక్సిజన్ స్థాయిలను పరీక్షించుకోవాలి. ఆ తర్వాత ఆరు నిమిషాలపాటు గదిలోనే వాకింగ్ చేయాలి. ఇప్పుడు మరోసారి పల్స్ ఆక్సీమీటర్తో ఆక్సిజన్ స్థాయిలను తెలుసుకోవాలి.
ఇలా ప్రతి రోజులో రెండు మూడు సార్లు పరీక్షించుకోవాలి. ఈ పరీక్షల్లో పల్స్ ఆక్సిమీటర్పై రీడింగ్ 94 అంతకంటే ఎక్కువగా నమోదవుతున్నట్లయితే ఆక్సిజన్ స్థాయిలు సాధారణంగా ఉన్నట్లని, రీడింగ్ 94 అంతకంటే తక్కువగా నమోదవుతున్నట్లయితే ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉన్నట్లని వైద్యులు చెబుతున్నారు.
ఇలా పరీక్ష చేసుకోవడం ద్వారా బాధితులు అందరికీ కృత్రిమ శ్వాస అందించాల్సిన అవసరం ఉండదు. కేవలం పల్స్ ఆక్సీమీటర్పై రీడింగ్ తక్కువగా ఉన్నవారికి వెంటిలేటర్ అమరిస్తే సరిపోతుంది. ఈ విధంగా ఆరు నిమిషాల నడక పరీక్షను ఉపయోగించుకోవడం ద్వారా ఆక్సిజన్ కొరత సమస్యకు పరిష్కారం లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
పంది తల, చేప చర్మం.. ఒడిశాలో వింత శిశువు జననం..!
కరోనా కల్లోలం: పేద ప్రజలకు కేంద్రం తీపి కబురు..
మానవత్వం చాటుకుంటున్న ఆటోవాలా.. ఎలాగో తెలుసా..?
తెలంగాణలో కొత్తగా 6,206 కరోనా కేసులు
తెలంగాణలో మరో నాలుగు రోజులు వానలు