సిటీబ్యూరో, మార్చి 23(నమస్తే తెలంగాణ) : ప్రభుత్వానికి, ప్రైవేటు వ్యక్తుల మధ్య వివాదం కొనసాగుతున్న స్థలాన్ని… ప్రైవేటు వ్యక్తులకు అమ్మకానికి పెట్టి రూ.7 కోట్లు వసూలు చేసి మోసం చేసిన ముగ్గురు నిందితులను అరెస్ట్చేసి మంగళవారం సీసీఎస్ పోలీసులు కోర్టు లో హాజరుపరిచారు. బంజారాహిల్స్ రోడ్డు నం. 12లో ఉన్న 9 ఎకరాల 17 గుంటల భూమికి సంబంధించిన నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన తిరుమల రాంచందర్ రో, దర్పల్లి సంపత్, మరో వ్యక్తి కలిసి జూబ్లీహిల్స్కు చెందిన మిహిరా బిల్డ్కాన్ మేనేజింగ్ పార్టనర్ అయిన చాడ సుఖేశ్రెడ్డికి విక్రయించేందుకు ప్రయత్నించి, అడ్వాన్స్గా రూ. 7 కోట్లు తీసుకొని మోసం చేసిన విషయం తెలిసిందే. ఈ స్థలం విషయంలో ప్రభుత్వానికి, ప్రైవేటుకు మధ్య వివాదం జరుగుతుంది. దీంతో ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను నిందితులు సృష్టించారు.
అయితే రెవెన్యూ రికార్డుల్లో జితిన్ రాజ్ జైన్, యూనిటెక్ టియల్ ఎస్టేట్ బిల్డర్స్కు యాజమాన్య హక్కులు లభించే విధంగా రికార్డులను మార్పించి, ఈ స్థలానికి సంబంధించిన ఎన్ఓసీని కూడా తీసుకువస్తామని నిందితులు.. కొనుగోలుకు ముందుకు వచ్చిన మిహిరా బిల్డ్కాన్ ప్రతినిధులకు హామీ ఇచ్చారు. నిందితులు చెప్పిన విషయాలు, ఆ స్థలానికి సంబంధించిన పూర్వ పరాలను పరిశీలించడంతో ఇదంతా మోసమని గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీసీఎస్ ఏసీపీ వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో దర్యాప్తు జరిపారు. నిందితులు పక్కా ప్లాన్తో బాధితుడిని మోసం చేసినట్లు దర్యాప్తులో తేలడంతో నిందితులు తిరుమల రాంచందర్ రో, దర్పల్లి సంపత్, తిరుమల అవినాష్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచామని సీసీఎస్ జాయింట్ సీపీ అవినాస్ మహంతి తెలిపారు.