హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పచ్చదనాన్ని మరింతగా పెంచేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకొన్నది. పల్లెలు, పట్టణాల్లో ఆరువేల ఎకరాల్లో ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గ్రామాల్లోని 534 ప్రాంతాల్లో 5,291 ఎకరాల్లో, పట్టణాల్లో 219 ప్రాంతాల్లో 670 ఎకరాల్లో బృహత్ పట్టణ ప్రకృతి వనాలను ఏర్పాటు చేయటానికి స్థలాలను గుర్తించారు. త్వరలో వీటి పనులు ప్రారంభం కానున్నాయి. ఒక్కో ప్రకృతి వనాన్ని పది ఎకరాల స్థలం లో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో, పట్టణంలోని ప్రతి వార్డులో ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. ప్రజల నుంచి మరింత స్పందన రావటంతో మండలానికి ఒకటి చొప్పున భారీ ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. ఈ నెల 1 నుంచి 10 వరకు జరిగిన పల్లె, పట్టణప్రగతిలో అధికారులు స్థలాలను గుర్తించారు. ప్రకృతివనాల ఏర్పాటుకు రూ.40లక్షల చొప్పున మంజూరు చేశారు. త్వరలోనే వీటి పనులు ప్రారంభం కానున్నాయి. పట్టణాల్లో స్థలం తక్కువగా లభ్యమయ్యే అవకాశాలు ఉండటంతో కనీసం ఐదు నుంచి పది ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయనున్నారు. బృహత్ పట్టణ ప్రకృతివనాల కోసం 5-10 ఎకరాల స్థలాన్ని 77 ప్రాంతా ల్లో(492 ఎకరాలు), కనీసం ఎకరం, ఆపైన విస్తీర్ణం ఉన్న 178 ఎకరాల స్థలాన్ని 142 ప్రాంతాల్లో గుర్తించారు.