రాష్ట్రంలో ప్రభుత్వ వరం..
అనారోగ్యంతో రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లలేక ఓ రైతు ఇబ్బంది పడుతుంటే సాక్షాత్తూ రెవెన్యూ యంత్రాంగం.. ఆ రైతు రంగోలి నర్సింహులుచారి ఇంటికి తరలి వచ్చింది. తాసిల్దార్ శ్రీదేవి సమక్షంలో ఆయన ఇంట్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేసి శభాష్ అనిపించుకుంది. మెదక్ జిల్లా తూప్రాన్లో చోటుచేసుకున్న ఈ అరుదైన సేవ పలువురి ప్రశంసలు అందుకున్నది.
తూప్రాన్ రూరల్, మార్చి 15: పక్షవాతంతో నడువలేని స్థితిలో ఉన్న రైతుపట్ల ఓ తాసిల్దార్ మానవత్వం చూపారు. తాసిల్దార్ కార్యాలయంలో చేయాల్సిన ధరణి రిజిస్ట్రేషన్ను బాధితుడి ఇంటికే వెళ్లి పూర్తిచేశారు. మెదక్ జిల్లా తూప్రాన్కు చెందిన రంగోలి నర్సింహులుచారికి పక్షవాతం రావడంతో కొంతకాలంగా మంచానికే పరిమితమయ్యాడు. మెరుగైన చికిత్స కోసం పట్టణ శివారులో తనకున్న ఎకరం 18 గుంటల భూమిని విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. ఆ భూమిని బొడ్డు సందీప్కుమార్ కొనుగోలు చేయాలని భావించాడు. రిజిస్ట్రేషన్ కోసం నర్సింహులుచారి తాసిల్దార్ కార్యాలయానికి వెళ్లాల్సి ఉండగా.. అనారోగ్యం దృష్ట్యా అక్కడికి వెళ్లలేకపోయాడు. విషయం తెలుసుకున్న తాసిల్దార్ శ్రీదేవి.. ఆర్ఐ సంతోష్, సీనియర్ అసిస్టెంట్ జయభారత్రెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ సుమంత్తో కలిసి సోమవారం నర్సింహులుచారి ఇంటికివెళ్లి ధరణి రిజిస్ట్రేషన్ను పూర్తిచేశారు. నడవలేని స్థితిలో ఉన్న నర్సింహులుచారిపై మానవత్వంతో ఇంటికే వెళ్లి రిజిస్ట్రేషన్ చేసిన అధికారులను స్థానికులు అభినందిస్తున్నారు.