మేడ్చల్, జూన్ 15 (నమస్తే తెలంగాణ)/ఇబ్రహీంపట్నం : వానాకాలం ప్రారంభమైంది. నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో రాష్ర్టవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. వానొచ్చిందంటే రైతన్నకు సంబురం. వ్యవసాయ పనులు ప్రారంభించాలనే ఆరాటం మొదలవుతుంది. సీఎం కేసీఆర్ సాగు రంగానికి అధిక ప్రాధాన్యమిచ్చి ప్రాజెక్టులు నిర్మిస్తూ చెరువులు నింపుతున్నారు. అయితే సాగు ప్రారంభానికి ముందే విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీ ఖర్చుల కోసం ఎకరానికి రూ.5 వేల చొప్పున పెట్టుబడి సాయం (రైతుబంధు) అందజేస్తున్నది. ఇప్పుడు సీజన్ ప్రారంభం కావడంతో మంగళవారం నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు సాయం జమ కావడం ప్రారంభమైంది. బ్యాంకు ఖాతాల్లో నగదు జమైనట్లు సమాచారం రావడంతో రైతులు మురిసిపోతున్నారు. తొలిరోజు ఎకరంలోపు ఉన్న రైతులకు నగదు జమ చేసినట్లు వ్యవసాయాధికారులు వెల్లడించారు.
మేడ్చల్ జిల్లావ్యాప్తంగా 77,926 ఎకరాల వ్యవసాయ భూములుండగా, 40,291 మంది రైతులకు రైతుబంధు పథకం వర్తించనున్నది. మొత్తం రూ.38,96, 28 వేలను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. తొలిరోజు మంగళవారం 3 కోట్ల 51 లక్షల 16 వేల రూపాయలను 13,544 మంది రైతుల ఖాతాల్లో జమ చేశారు.
రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 3,24,795 మంది రైతులు ఉండగా, రైతుబంధు పథకం కింద రూ.373.68 కోట్ల పెట్టుబడి సాయం అందనున్నది. తొలిరోజు రంగారెడ్డి జిల్లాలో 88,816 మంది రైతుల ఖాతాల్లో 28 కోట్ల 34 లక్షలు జమ అయ్యాయి.దీంతో రెట్టింపు ఉత్సాహంతో వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్నారు. పెట్టుబడి సాయం అందించడంతో ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరిగూడలోని రైతువేదిక వద్ద సర్పంచ్ రాంరెడ్డి, మండల రైతుబంధు సమితి కన్వీనర్ అంజిరెడ్డి, ఎంపీపీ కృపేష్లు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
సాగుకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువుల కొనుగోలు తదితర ఖర్చుల కోసం నగదు అందుతుండటంతో రైతులంతా వ్యవసాయాన్ని ఇష్టపడి చేస్తున్నారు. 2018 నుంచి ఇప్పటివరకు రైతుబంధును అందిస్తుండటంతో పడావు భూములను కూడా చక్కగా సాగు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రతి ఏటా సాగు పెరుగుతూ వస్తున్నది. మేరీ రేఖ, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యవసాయాధికారి
వ్యవసాయం ఇష్టపడి చేస్తున్నాం. పనులు ప్రారంభించాలంటే అప్పు చేయాల్సిందే. ఇప్పుడా పరిస్థితి లేదు. కేసీఆర్ సార్ రైతుబంధు ఇచ్చినప్పటి నుంచి అప్పు చేయలేదు. నగదు జమైనట్లు ఫోన్కు సమాచారం వచ్చింది. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తాం. -కటికల రమేశ్, రైతు, నర్సంపల్లి
సాగుకు పెట్టుబడి సాయం అందజేస్తూ రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ అండగా నిలుస్తున్నారు. వ్యవసాయం వద్దనుకుంటున్న సమయంలో రైతుబంధు అందిస్తూ ఇష్టపడి వ్యవసాయం చేసేలా ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సార్కు కృతజ్ఞతలు.
-భిక్షపతి, రైతు, జగన్గూడ
వ్యవసాయ పనులకు అప్పు అడుగుడు బందైంది. పనులు ప్రారంభం కాకముందే సీఎం కేసీఆర్ సార్ పైసలు బ్యాంకుల్లో వేస్తున్నారు. వచ్చిన పైసలతోనే విత్తనాలు, ఎరువులను కొంటున్నాం. పంట చేతికి వచ్చినంక అప్పులు తీర్చేటోళ్లం. ఇప్పుడు అ బాధ లేదు. -మోతే లక్ష్మయ్య, గోషాయిగూడ
కందుకూరు : పెట్టుబడి సాయం అందించడంపై ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కృష్ణరాంభూపాల్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి మాట్లాడుతూ కరోనా క్లిష్ట పరిస్థితుల్లోనూ రైతులకు అండగా నిలవాలని సీఎం కేసీఆర్..ఎన్ని ఇబ్బందులు ఉన్నా రైతుబంధు అమలు చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురుసాని వరలక్ష్మీ సురేందర్రెడ్డి, పార్టీ అధ్యక్షుడు జయేందర్, ఉపాధ్యక్షుడు ఆనేగౌని దామోదర్గౌడ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్రెడ్డి, డైరెక్టర్లు సామ ప్రకాష్రెడ్డి, ఆనంద్, పాండు, పారిజాతం, పాండురంగారెడ్డి, పార్టీ నాయకులు గంగాపురం లక్ష్మీనర్సింహారెడ్డి, మస్కు బాబు, దేవేందర్, మోహన్రెడ్డి, ప్రశాంత్రెడ్డి, రవికుమార్రెడ్డి, కార్తీక్, బొక్క దీక్షిత్రెడ్డి, బాలమల్లేష్ పాల్గొన్నారు.
మహేశ్వరం : సీఎం కేసీఆర్ రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని సహకార బ్యాంకు చైర్మన్ మంచె పాండుయాదవ్, జిల్లా రైతు బంధు సమితి నాయకుడు కూన యాదయ్య అన్నారు. కరోనా కష్టకాలంలో కూడా సకాలంలో రైతుబంధు నిధులు విడుదల చేయడంపై మహేశ్వరం,దుబ్బచర్ల, నాగారం క్లస్టర్ రైతులతో కలిసి సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సునితాఆంద్యానాయక్, సర్పంచ్లు బండారి లావణ్యలింగం, సాలీ వీరానాయక్, మెగావత్ రాజునాయక్, నాయకులు మద్ది కరుణాకర్రెడ్డి, దిద్దెల అశోక్కుమార్, కడమోని ప్రభాకర్, దశరథ, అంజయ్యయాదవ్, పర్వతాలు, రైతులు లింగ్యానాయక్, రాజు, యాదయ్య, మైమూద్ఖాన్, వెంకటేశ్ పాల్గొన్నారు.