హైదరాబాద్, ఆగస్టు 9: నాట్కో ఫార్మా అంచనాలకుమించి ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన తొలి త్రైమాసికానికి రూ.320.4 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.75 కోట్ల లాభంతో పోలిస్తే ఎన్నో రెట్లు పెరిగింది. సమీక్షకాలంలో కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.410.3 కోట్ల నుంచి రూ.884.6 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. దీంట్లో ఫార్మాస్యూటికల్ సెగ్మెంట్ నుంచి రూ.883.6 కోట్ల ఆదాయం సమకూరినట్లు కంపెనీ పేర్కొంది. రిటైర్మెంట్ స్కీంను ప్రవేశపెట్టడంతోపాటు ఆర్అండ్ డీ కోసం అధికంగా నిధులు వెచ్చించడం వల్లనే ఖర్చులు అధికమయ్యాయని పేర్కొంది. గడిచిన త్రైమాసికంలో స్వచ్ఛంద పదవీ విరమణ పథకం కింద రూ.29 కోట్లు ఖర్చు చేసింది. మరోవైపు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.3.50 మధ్యంతర డివిడెండ్ను బోర్డు ప్రతిపాదించింది.