హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): రూ.63 కోట్ల తెలుగు అకాడమీ ఫిక్స్డ్ డిపాజిట్ల కుంభకోణంలో సూత్రధారులుగా భావిస్తున్న మరో ఆరుగురిని సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే అరెస్టయిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్వాన్శాఖ మాజీ చీఫ్ మేనేజర్ మస్తాన్ వలీని ఈ నెల 12 వరకు కస్టడీకి తీసుకొని విచారించేందుకు నాంపల్లి కోర్టు అనుమతించింది. ప్రస్తుతం జైల్లో ఉన్న ఏపీ మర్కంటైల్ కోఅపరేటివ్ సొసైటీ లిమిటెడ్ చైర్మన్ సత్యనారాయణ, మేనేజర్లు పద్మావతి, మొహినుద్దీన్ల కస్టడీపై కోర్టు నిర్ణయం గురువారానికి వాయిదా పడింది. మరోవైపు ప్రభుత్వం ఇంటర్బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ నేతృత్వంలో నియమించిన త్రిసభ్య కమిటీ మంగళవారం నివేదిక సమర్పించింది. ఎఫ్డీలు, ఖాతాల నిర్వహణలో శాఖాపరమైన నిర్లక్ష్యం, ఔట్సోర్సింగ్ సిబ్బంది ద్వారా ఆర్థిక లావాదేవీలు జరపడం, అకౌంట్స్ విభాగం, ఉన్నతాధికారుల పర్యవేక్షణలోపాలను నివేదిక ఎత్తిచూపినట్టు తెలిసింది. కమిటీ తెలుగు అకాడమీ డైరెక్టర్ ఎం సోమిరెడ్డి సహా అకాడమీ ఉద్యోగులందరిని విచారించి రికార్డులను పరిశీలించింది. రూ.63 కోట్లు గోల్మాల్ కాగా, మిగతా రూ.257 కోట్ల ఎఫ్డీలు సురక్షితంగా ఉన్నట్టు త్రిసభ్య కమిటీ ధ్రువీకరించినట్టు ఓ అధికారి తెలిపారు.