హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): రామప్ప పరిరక్షణ ఉద్యమానికి ‘నమస్తే తెలంగాణ’ వారధి కట్టింది. సమైక్యపాలకులు చేపట్టిన జలయజ్ఞంతో రామప్పకు ముప్పు ఉన్నదని నమస్తే తెలంగాణ వచ్చిన తొలినాళ్లలోనే వెలుగులోకి తెచ్చింది. ‘రామప్పకు జలయజ్ఞం ముప్పు’ అని 2011, జనవరి 24న పతాకశీర్షికలో ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. పాలంపేట గ్రామం మధ్య నుంచి దేవాదుల సొరంగాన్ని తవ్వటం ద్వారా సమీపంలోని రామప్పకు ముప్పు ఉంటుందని నమస్తే తెలంగాణ లోకానికి తెలిపింది. దేవాదుల సొరంగ ముఖద్వారం నుంచి 100 మీటర్ల దూరంలో ఉన్న రామప్ప కూలిపోతుందని హెచ్చరించింది. రామప్పకు జరిగే నష్టాన్ని దాదాపు ఏడాది పాటు విభిన్న కోణాల్లో వెలుగులోకి తెచ్చింది. వివిధ ప్రాంతాల ప్రముఖులు, శిల్పకళాప్రేమికులు పాలంపేట వాస్తవ్యులతో కలిసి ‘రామప్ప పరిరక్షణ సమితి’ని ఏర్పాటుచేసి ఆందోళన చేశారు. నమస్తే తెలంగాణ కథనాల ఆధారంగా అప్పటి సరారు ఎన్జీఆర్ఐ, సెంట్రల్మైన్స్ అండ్ ఫ్యుయల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్, రాక్ యాక్సిలరేషన్ అండ్ మైనింగ్ ఇంజినీరింగ్ విభాగం, ఐఐటీ హైదరాబాద్, ఎన్ఐటీ వరంగల్, నాగపూర్ మైనింగ్ రిసెర్చ్ పరిశోధనలు చేసి ‘సొరంగ మార్గం ద్వారా రామప్పకు ముప్పే’ అని తేల్చిచెప్పాయి. దీంతో విధిలేని పరిస్థితుల్లో సమైక్య ప్రభుత్వం దేవాదుల సొరంగ మార్గ దిశను మార్చుకోవాల్సి వచ్చింది.