చెన్నై: కాళ్లకు ధరించిన బూట్లు నీటిలో తడుస్తాయని పడవ దిగేందుకు వెనుకాడిన మంత్రిని మత్స్యకారులు తమ చేతులపై మోశారు. తమిళనాడులోని తిరువల్లూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది. అధికార డీఎంకే పార్టీకి చెందిన మత్స్యశాఖ మంత్రి అనితా రాధాకృష్ణన్ సముద్రపు కోతను పరిశీలించేందుకు పాలవర్కడులో పర్యటించారు. స్థానికులతో మాట్లాడిన అనంతరం పడవపై ఆయన ప్రయాణించారు. బోటు తీరానికి చేరగా మంత్రి దిగేందుకు మత్స్యకారులు ఒక కూర్చివేశారు. అయితే పడవ ఒడ్డుకు కాస్త దూరంలో నిలిచింది. దీంతో తన కాలి బూట్లు నీటిలో తడుస్తాయని భావించిన అనితా రాధాకృష్ణన్ పడవ దిగేందుకు వెనుకాడారు. మంత్రి భావాన్ని గ్రహించిన మత్స్యకారులు ఆయనను తమ చేతులపై మోసి ఒడ్డుకు చేర్చారు. కాగా, ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. మంత్రి వీఐపీ కల్చర్పై పలువురు విమర్శలు చేశారు.