న్యూఢిల్లీ: పిల్లలపై కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ కోసం ఢిల్లీ ఎయిమ్స్లో ఇవాళ స్క్రీనింగ్ ప్రారంభమైంది. రెండేళ్ల నుంచి 18 ఏళ్ల మధ్య వారికి కోవాగ్జిన్ టీకాలు ఇవ్వనున్నారు. ఇప్పటికే పాట్నా ఎయిమ్స్లో పిల్లలపై ట్రయల్స్ ప్రారంభం అయ్యాయి. భారత్ బయోటెక్కు చెందిన కోవాగ్జిన్ టీకా పిల్లలపై పనిచేస్తుందా లేదా అని స్టడీ చేయనున్నారు. స్క్రీనింగ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత పిల్లలకు టీకాలు ఇవ్వనున్నారు. 525 మంది వాలంటీర్లకు టీకాలు ఇస్తారు. రెండు డోసుల రూపంలో టీకా ఇవ్వనున్నారు. 28వ రోజు తర్వాత రెండో డోసు ఇస్తారు. కోవాగ్జిన్ స్క్రీనింగ్ ట్రయల్స్ స్టార్ట్ అయ్యాయని, రిపోర్ట్స్ వచ్చాక వారికి టీకా ఇస్తామని ఢిల్లీ ఎయిమ్స్ ప్రొఫెసర్ డాక్టర్ సంజయ్ రాయ్ తెలిపారు. రెండేళ్ల నుంచి 18 ఏళ్ల వయసున్న వారికి రెండవ, మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు డీజీసీఐ అనుమతి ఇచ్చింది.