నిజామాబాద్, సెప్టెంబర్ 24, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా సంక్షోభంతో కుదేలైన వాహన రంగం క్రమంగా గాడిలో పడుతున్నది. ఈ మహమ్మారి నేర్పిన పాఠంతో ఇప్పుడు ఎంతో మంది సొంత వాహనాలను సమకూర్చుకొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి వారికోసం వివిధ కంపెనీల వాహనాలతో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికలు నిజామాబాద్ కలెక్టరేట్ గ్రౌండ్లో ఆటో షోను ఏర్పాటు చేశాయి. నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ బీ చంద్రశేఖర్, రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ కే వెంకటరమణ, నమస్తే తెలంగాణ ప్రకటనల విభాగం జనరల్ మేనేజర్ సురేందర్రావు శుక్రవారం రిబ్బన్ కట్చేసి దీన్ని ప్రారంభించారు. మూడు రోజులపాటు జరిగే ఈ షోలో అధునాతన టెక్నాలజీ కూడిన పలు కంపెనీల కార్లు, ద్విచక్ర వాహనాలు కొలువుదీరాయి. రూ.2.99 లక్షల ధరతో మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండే మారుతి సుజుకి ఆల్టో మొదలుకొని రూ.72 లక్షల విలువచేసే మెర్సిడెజ్ బెంజ్ వరకు పలు రకాల కార్లు అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేకించి బ్యాటరీతో నడిచే వాహనాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఈ ప్రదర్శనను సందర్శించిన నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు.. ఆ ప్రాంగణంలో బ్యాటరీ వాహనాన్ని నడిపి అందర్నీ ఉత్సాహపరిచారు. మారుతి సుజుకి, టాటా, మహీంద్రా, హుందాయ్, కియా, హోండా, ఎంజీ, స్కోడా, మెర్సిడెజ్ బెంజ్ తదితర కంపెనీల కార్లు ఈ షోలో కొలువుదీరాయి. టూవీలర్ల క్యాటగిరీలో హీరో, యమహా, హోం డా, అప్రిలియా (వెస్పా), బెనెల్లీ, హీరో ఎలక్ట్రిక్, బిగాస్ సంస్థల వాహనాలు అందుబాటులో ఉన్నా యి. వీటిలో ఎలక్ట్రిక్ వాహనాలు విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. షో ప్రారంభోత్సవంలో నమస్తే తెలంగాణ బ్రాంచ్ మేనేజర్ గడ్డి ధర్మరాజు, ఎడిషన్ ఇన్చార్జ్ రంగు ప్రవీణ్కుమార్, బ్యూరో ఇన్చార్జ్ జూపల్లి రమేశ్, అడ్వైర్టెజ్ విభాగం అసిస్టెంట్ మేనేజర్ కడార్ల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
అక్కడికక్కడే రుణాలు
వాహన కొనుగోలుదారులకు రుణ సదుపాయాన్ని కల్పించేందుకు ఆటో షోలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారులు తమ స్టాళ్లను ఏర్పాటుచేసి అర్హులకు అక్కడికక్కడే రుణాలు అందిస్తున్నారు. తద్వారా ఆటో షోతో ఆయా బ్యాంకులు లబ్ధి పొందుతున్నాయి.
చక్కటి ప్రయత్నం
నమస్తే తెలంగాణ – తెలంగాణ టుడే ఏర్పాటు చేసిన ఆటో షో అద్భుతంగా ఉన్నది. హైదరాబాద్ వంటి పెద్ద నగరాలకే పరిమితమైన ఆటోషోలను నిజామాబాద్లోనూ ఏ ర్పాటు చేయడం చక్కని ప్రయత్నం. ఈ ప్రాం త వాసులకు మంచి వేదికగా నిలుస్తుంది. – బీ చంద్రశేఖర్, అదనపు కలెక్టర్, నిజామాబాద్ జిల్లా
అధునాత వాహనాలు బాగున్నాయి
రవాణా రంగంలో వస్తున్న మార్పులకు నమస్తే తెలంగాణ – తెలంగాణ టుడే ఆటో షో అద్దం పడుతున్నది. బ్యాటరీ వాహనాలు మొదలుకొని అంతర్జాతీయ కంపెనీలకు చెందిన అధునాతన వాహనాలను ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంచడం బాగున్నది. ఆటో షో ప్రజలకు ఉపయోగపడుతుంది. – డాక్టర్ కే వెంకటరమణ, డిప్యూటీ రవాణా కమిషనర్, నిజామాబాద్ రీజియన్
ఆటోమొబైల్ రంగానికి ఊపు
ఇలాంటి ఆటో షోలతో వాహన పరిశ్రమకు సరికొత్త ఉత్తేజం లభిస్తుంది. కరోనాతో పడిపోయిన వాహన అమ్మకాలు తిరిగి పుంజుకొంటున్న వేళ నమస్తే తెలంగాణ – తెలంగాణ టుడే పత్రికలు వివిధ ఆటోమొబైల్ కంపెనీలను, బ్యాంకులను ఒకే గొడుగు కిందికి తేవడంతో ప్రజలకు రిస్క్ తగ్గుతుంది. – సురేందర్రావు, జనరల్ మేనేజర్, నమస్తే తెలంగాణ ప్రకటనల విభాగం