ఇబ్రహీంపట్నం, మే 6 : రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపాలిటీ నమస్తే తెలంగాణ విలేకరి బృంగి శశివర్ణం కరోనాతో కన్నుమూశారు. నాలుగైదు రోజులుగా తీవ్ర లక్షణాలతో ఆయన బాధపడుతున్నారు. రెండ్రోజుల కిందట శ్వాసతీసుకోవడం ఇబ్బందిగా మారడంతో కుటుంబసభ్యులు నగరంలోని పలు దవాఖానల్లో చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో గురువారం గాంధీ దవాఖానలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మృతిచెందారు. శశివర్ణం 1990 నుంచి ఇబ్రహీంపట్నం ప్రాంతంలో పలు దినపత్రికల్లో విలేకరిగా పనిచేశారు. ప్రస్తుతం నమస్తే తెలంగాణ ఆదిబట్ల మున్సిపాలిటీ విలేకరిగా పనిచేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా టీయూడబ్ల్యూజే ఉపాధ్యక్షుడిగా ఆయన కొనసాగుతున్నారు. శశివర్ణంకు భార్య, కుమారుడు ఉన్నారు. శశివర్ణం మృతిపట్ల ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డితోపాటు వివిధ పార్టీల నాయకులు తదితరులు సంతాపం తెలిపారు.