(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కొవిడ్ మహమ్మారితో జనజీవనం అతలాకుతలమవుతున్నది. ఏడాది కాలంగా వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలన్నీ కుదేలవుతున్నాయి. పేదలు కడుపు నిండా తిండి తినడమే గగనమైంది. దురదృష్టవశాత్తు కరోనా సోకితే వైద్యం కోసం డబ్బులు చెల్లించుకోలేని దుస్థితి నెలకొంది. పెరిగిన ఔషధాలు, వైద్య పరికరాల ధరలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి విపత్కర సమయంలో ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నది. కనీసం ప్రజలకు ఉచిత వ్యాక్సిన్ కూడా ఇవ్వలేని దుస్థితిలో మోదీ ప్రభుత్వం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వాలే భారం అనుకోకుండా ప్రజలకు టీకాలు అందిస్తున్నాయి. ఇలాంటి విషమ పరిస్థితిల్లోనూ కేంద్రం దొంగ దెబ్బ కొడుతోంది. చరిత్రలో రికార్డు స్థాయిలో గడిచిన వారం రోజులుగా మరోమారు పెట్రో, డీజిల్ మంటతో సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఫలితంగా నిజామాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.99.30కి చేరింది. డీజిల్ రూ.94.09 చేరడంతో వాహనాదారులు షాక్కు గురవుతున్నారు.
కనికరం లేని కేంద్ర సర్కారు…
దేశంలోని ఆయా రాష్ర్టాల్లో లక్షల్లో చేరిన యాక్టివ్ కేసులతో ప్రజలంతా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకీడుస్తున్నారు. సంపాదించిన సొమ్మంతా వైద్యానికి పోతోంది. పొట్ట కూటి కోసం బతికే కుటుంబాలు కనీసం ఉపాధి లేక విలవిల్లాడుతున్నాయి. మానవతా వాదులు కడుపు నిండా తిండి పెడుతుండడంతో పేదలు తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆపన్నహస్తం అందించాల్సిన కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరితో ఎలాంటి సాయం చేయడం లేదు. పైగా ఉచిత సలహాతో రాష్ట్ర ప్రభుత్వాలకు పూటకో సూచనలు చేస్తూ ఆగం పట్టిస్తోంది. వైద్య పరికరాలు, టీకాలు, ఔషధాలపై జీఎస్టీ విధిస్తూ ప్రజల నుంచి అక్రమంగా సొమ్ము లాగుతున్న కేంద్రం కనీసం దేశ ప్రజలపై కనికరం లేకుండా ఇంధన ధరలను సైతం భారీగా పెంచుతోంది. మార్చి, ఏప్రిల్ నెలల్లో తటస్థంగా ఉన్న ధరలు కాస్త ఐదు రాష్ర్టాల్లో ఎన్నికలు ముగియడంతో మరోమారు పైసా చొప్పున దొడ్డి దారిలో పెంచుతూ ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలను రూ.100కు చేర్చింది. ఇష్టానుసారంగా ఇంధన ధరల పెంపుపై ప్రజలంతా తీవ్రంగా మండిపడుతున్నారు. కేంద్రం తీసుకుంటున్న ధరల పెంపు నిర్ణయంపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇంధన ధరల ప్రభావం పరోక్షంగా ఇతర వస్తువులు, నిత్యావసరాలపైనా పడుతుండడంతో ఆందోళన చెందుతున్నారు.
ఐదు నెలల్లో పెట్రోల్, డీజిల్పై రూ.15వరకు పెంపు
మే నెల ప్రారంభంలో లీటర్ డీజిల్ ధర రూ.89.36 ఉంది. మే నెలాఖరుకు రూ.93.99 చేరింది. నెల రోజుల్లోనే పైసా చొప్పున భారం మోపుతూ ఏకంగా రూ.4.63 పెంచేశారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో దేశంలోని పలు రాష్ర్టాల్లో ఎన్నికల దృష్ట్యా డీజిల్ ధరల్లో పెరుగుదల అంతగా కనిపించలేదు. ఫిబ్రవరి నెలలో 3వ తేదీన లీటర్ డీజిల్ ధర రూ.84.89 ఉండగా ఫిబ్రవరి 28వ తేదీ నాటికి రూ.90.16 వరకు పెంచారు. అంటే దాదాపుగా రూ.5.27 భారం మోపారు. 2021 ప్రారంభంతోనే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ వాత మోగించింది. జనవరి ఒకటో తేదీన రూ.82.03 ఉన్నటువంటి డీజిల్ ధర జనవరి 31నాటికి రూ.84.89కి చేర్చింది. రూ.3 మేర ధరలను పెంచారు. జనవరి నుంచి మే నెలాఖరుకు సరాసరిగా రూ.13 పెంచారు.
మే నెల 3వ తేదీన లీటర్ పెట్రోల్ ధర రూ.95.41 ఉంది. నెలాఖరుకు వచ్చే సరికి దాదాపుగా రూ.వందకు చేరింది. ప్రస్తుతం పెట్రోల్ బంకుల్లో రూ.99.30 పలుకుతోంది. మే నెలలోనే సుమారు రూ.4 పెంచారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఇంధన ధరలు తటస్థంగానే ఉన్నాయి. ఫిబ్రవరిలో పెట్రోల్ ధర అమాంతం రూ.5వరకు పెరిగింది. ఫిబ్రవరి 3వ తేదీన రూ.91.31 పలికింది. ఫిబ్రవరి 28నాడు రూ.96.21 చేరింది. అంటే రూ.5 ఎగబాకింది. 2021 కొత్త సంవత్సరం ప్రారంభంలోనూ ప్రజలకు పెట్రో వాత తప్పలేదు. జనవరి ఒకటో తేదీన రూ.88.60 పలికిన లీటర్ పెట్రోల్ ఏకంగా జనవరి 31నాటికి రూ.91.31 చేరింది. అంటే జనవరిలో రూ.3 వరకు పెరిగింది. ఐదు నెలల కాలంలో లీటర్ పెట్రోల్పై కేంద్ర ప్రభుత్వం రూ.12 వరకు భారం పెంచింది.