హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎంపీ సంతోష్కుమార్ చేపట్టిన ముక్కోటి వృక్షార్చనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆ పార్టీ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు పిలుపునిచ్చారు. తన పనితీరుతో రాష్ట్ర ప్రతిష్ఠను, గౌరవాన్ని దేశ, విదేశాల్లో పెంచుతూ ప్రతి తెలంగాణ బిడ్డ గర్వపడేలా, యువతకు ఆదర్శంగా నిలుస్తున్న మంత్రి కేటీఆర్ పుట్టినరోజు నేపథ్యంలో ఈ నెల 24న ప్రతి ఒక్కరూ శుభాకాంక్షలు తెలుపాలని గురువారం ఒక ప్రకటనలో కోరారు. ఒక్క గంటలో రాష్ట్రవ్యాప్తంగా 3 కోట్ల మొక్కలు నాటాలనే ఎంపీ సంతోష్కుమార్ చేపట్టిన ముక్కోటి వృక్షార్చనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ముకోటి వృక్షార్చనకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ సిద్ధమైనట్టు సంస్థ చైర్మన్ కోలేటి దామోదర్గుప్తా పేర్కొన్నారు. ఎంపీ సంతోష్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ కార్యాలయాల ఆవరణలోని ఖాళీ స్థలాల్లో సిబ్బంది విరివిగా మొక్కలు నాటుతారని, కాచిగూడ ట్రాఫిక్ పోలీస్స్టేషన్ ప్రాంగణంలో తాను మొకలు నాటనున్నట్టు వివరించారు.