దేవరుప్పుల, జూన్ 2 : నకిలీ విత్తనాలు, పురుగుమందులు విక్రయిస్తే సంబంధిత ఎరువుల దుకాణాల యజమానులపై పీడీ యాక్ట్ పెట్టడమేకాక, వ్యవసాయ శాఖ ఆ దుకాణాల లైసెన్స్లు రద్దు చేస్తుందని పాలకుర్తి సీఐ వట్టె చేరాలు అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఎరువుల దుకాణాల డీలర్లతో బుధవారం స్థానిక ఎస్సై చెన్నమనేని కరుణాకర్రావు అధ్యక్షతన సమావేశం నిర్వహించగా మండల వ్యవసాయ అధికారి రామకృష్ణ, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ ఈదునూరి నర్సింహరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ వానకాలం ప్రారంభమైన తరుణంలో రైతులు విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు కొనుగోలు చేస్తారని, డీలర్లు నకిలీవి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు కొనుగోలు చేసిన వస్తువులకు డీలర్లు రసీదులు ఇవ్వాలని తెలిపారు. ఎరువుల దుకాణాలను టాస్క్ఫోర్స్ టీమ్లు తనిఖీ చేస్తాయని, ఎలాంటి పొరపాట్లు దొర్లినా కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ విజయ్కుమార్, మండలంలోని పలు గ్రామాల డీలర్లు సీతారాంరెడ్డి, రాంనానాయణ, చంద్ర ప్రకాశ్. పాము శ్రీధర్, ఉమేశ్, రవి, నర్సింహులు, కార్తీక్రెడ్డి, పెండెం ప్రభాకర్, రాజు తదితరులు పాల్గొన్నారు.
మోసాలకు పాల్పడితే కేసుల నమోదు
బచ్చన్నపేట : ఎరువుల దుకాణాల డీలర్లు రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువులు,క్రిమిసంహారకాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని నర్మెట సీఐ కరుణాకర్ అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్లో బుధవారం ఎస్సై లక్ష్మణ్రావు ఎరువుల దుకాణాల యజమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ నాణ్యతలేని కంపెనీల విత్తనాలు విక్రయిస్తే డీలర్లే బాధ్యత వహించాలన్నారు. రైతులు కొన్న ప్రతి వస్తువుకు రసీదు ఇవ్వాలని, దీనిపై గడువు తేదీ, కంపెనీ పేరు లాట్ నంబర్ రాయాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి అనిల్కుమార్, పీఏసీఎస్ చైర్మన్ పూర్ణచందర్ పాల్గొన్నారు.