పర్యవేక్షిస్తున్న అధికారులు
ముమ్మరంగా కొనసాగుతున్న ప్రక్రియ
వరంగల్, ఏప్రిల్ 5 : గ్రేటర్ పరిధిలోని అన్ని డివిజన్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపు పక్రియను పక్కాగా చేపడుతున్నారు. సోమవారం అన్ని డివిజన్లలో సర్వేను మొదలుపెట్టారు. గ్రేటర్ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వేను పరిశీలించారు. సర్వే సమర్థవంతంగా చేసేలా సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. సర్వేలో నిర్లక్ష్యం ప్రదర్శించకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఓటర్ల గుర్తింపు చేపట్టాలని సూచించారు. కార్పొరేషన్లోని 66 డివిజన్లలో పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ చేపడుతున్నారు. ఎప్పటికప్పుడు సర్వే శాతాన్ని తెలుసుకుంటూ ఉన్నతాధికారులకు వివరాలు అందజేస్తున్నారు. అదనపు కమిషనర్ నాగేశ్వర్, ఏసీపీ గణపతి కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో పర్యటిస్తూ సర్వేను పరిశీలించారు. డిప్యూటీ కమిషనర్లు జోనా, రవీందర్ తమ సర్కిళ్ల పరిధిలో ఓటర్ల సర్వే పక్రియను పరిశీలించారు.
అన్ని డివిజన్లలో ముమ్మరంగా సర్వే
గ్రేటర్లోని అన్ని డివిజన్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల సర్వే ముమ్మరంగా సాగుతోంది. బుధవారం నాటికి సర్వే పూర్తి చేయాలన్న ఆదేశాలతో గ్రేటర్ సిబ్బందితో పాటు రెవెన్యూ సిబ్బంది సర్వేలో పాల్గొంటున్నారు. ఇప్పటికే గ్రేటర్ పన్నుల విభాగంలోని ఆర్ఐ, బిల్కలెక్టర్లతో పాటు టౌన్ప్లానింగ్ విభాగం టీపీఎస్, టీపీబీవోలు ఓటర్ల సర్వే చేస్తున్నారు. వీరికి మెప్మా సీవోలు సహకారం అందిస్తున్నారు. అయితే, గ్రేటర్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గణనను మరింత వేగవంతం చేసేందుకు రెవెన్యూ శాఖకు చెందిన వీఆర్వోలకు బల్దియా సిబ్బందికి సహకరించాలని ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు.
ఇవి కూడా చదవండి..
ఉత్తరాఖండ్ అడవుల్లో కొనసాగుతున్న దావానలం
తేయాకు తోటలో 20 కిలోల కాలనాగు కలకలం..!