నల్లగొండ : జిల్లా కేంద్రంలో బాల సదనం, శిశు గృహ అనాథ బాలికలు రాఖీ పౌర్ణిమ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, బాలల సంక్షేమ సమితి చైర్మన్ చింత కృష్ణలకు రాఖీ కట్టి రాఖీ పౌర్ణిమ పండుగ జరుపుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలికలకు నూతన వస్త్రాలు అందచేశారు. సోమవారం రాఖీ పండుగ రోజున జిల్లా కలెక్టర్ స్వయంగా విచ్చేసి రాఖీ కట్టించుకొని ఆత్మీయంగా తమ మధ్య పండుగ నిర్వహించడం వారు ఆనందం వ్యక్తం చేశారు.
సోదర, సోదరిల అనుబంధానికి గుర్తుగా మాత్రమే కాకుండా ఆత్మీయుల మధ్య కూడా ఐకమత్యానికి పరస్పర చిహ్నంగా రాఖీ పౌర్ణమి పండుగ చేసుకుంటారని కలెక్టర్ అన్నారు. అనాథ బాలికల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారితో ముచ్చటిస్తూ బాలికలను ఎలా చదువు తున్నారు. బాల సదనం నందు అందుతున్న సేవలు అడిగి తెలుసుకున్నారు. పై చదువులు శ్రద్ధగా కొనసాగించాలని, ప్రభుత్వం ద్వారా ఎటువంటి సహాయం అవసరమైనా తన వంతుగా సహకారం అందిస్తామని ఆయన చెప్పారు.
బాలల సంక్షేమ సమితి, నల్లగొండ చైర్మన్ చింత కృష్ణ మాట్లాడుతూ.. బాలికలందరూ బాగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా బాలసదనం, శిశుగృహ నందు జరుగుతున్న మరమ్మతు, అభివృద్ధి పనులు పరిశీలించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో బాలరక్షభవన్ కో ఆర్డినేటర్ హరిత, జిల్లా బాలల పరిరక్షణ అధికారి కె.గణేష్, తేజస్వి, విద్య, బాలసదనం, శిశు గృహ సిబ్బంది పాల్గొన్నారు.