ముంబై: అంతర్జాతీయ సానుకూల సంకేతాలతోపాటు దేశీయంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం స్టాక్ మార్కెట్లకు కలిసొచ్చింది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు (సోమవారం) భారీ లాభాలను ఆర్జించాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు కొద్ది సేపటికి లాభాల వైపు మళ్లాయి. 15,437 వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన నిఫ్టీ ఒక దశలో 15,606 వద్ద జీవితకాల గరిష్టానికి చేరుకుంది. చివరకు 147 పాయింట్ల లాభంతో 15,582 వద్ద స్థిరపడింది.
ఇక, 51,476 వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన సెన్సెక్స్ చివరకు 514 పాయింట్లు ఎగబాకి 51,937 వద్ద ముగిసింది. రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, భారతీ ఎయిర్టెల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ లాభాలను ఆర్జించాయి. ఎం అండ్ ఎం, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా ఎల్ అండ్ టీ నష్టాలను చవిచూశాయి.