చేర్యాల, మే 20 : కొమురవెల్లి మల్లికార్జునస్వామి వారి ఆలయ చైర్మన్ పదవిని మొదటిసారిగా ముదిరాజ్ సామాజిక వర్గానికి కేటాయించి తమ ఆత్మగౌరవాన్ని రెట్టింపు చేసిన ఘనత టీఆర్ఎస్ సర్కారుకే దక్కిందని మల్లన్న ఆలయ నూతన చైర్మన్ గీస భిక్షపతి అన్నారు. మల్లన్న ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం మల్లన్న ఆలయంలో ఈవో బాలాజీ ఆధ్వర్యంలో గురువారం నిరాడంబరంగా జరిగింది. దేవాదాయశాఖ ఉమ్మడి మెదక్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ.. నూతనంగా ఎన్నికైన గీస భిక్షపతి, తుమ్మల రవి, ఉత్కూరి అమర్, ధరావత్ అనిత, తాళ్లపల్లి శ్రీనివాస్, కొంగరి గిరిధర్, చింతల పరశురాములు, తివారి అలియాస్ బొందిలి దినేశ్కుమార్, బొంగు నాగిరెడ్డి, శెట్టె ఐలయ్య, ముత్యం నర్సింహులు, పొతుగంటి కొమురవెల్లి, గడ్డం మహేశ్యాదవ్ ధర్మకర్తలుగా ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ధర్మకర్తలు ట్రస్టు బోర్డు చైర్మన్గా గీస భిక్షపతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం నూతన చైర్మన్ భిక్షపతి మాట్లాడుతూ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆదేశాల మేరకు మల్లన్న క్షేత్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పిస్తామన్నారు.
ఆలయ చరిత్రలో మొదటిసారిగా ముదిరాజ్ కులానికి చైర్మన్ పదవి దక్కడం ఆనందంగా ఉందని తెలిపారు. దీంతోపాటు కొమురవెల్లి గ్రామానికి చెందిన వారికి చైర్మన్ పదవి రావడం ఇదే ప్రథమమని సంతోషం వ్యక్తం చేశారు. ఆలయ అధికారులు, అర్చకులు, ఒగ్గు పూజారులు, సిబ్బందితోపాటు అన్ని వర్గాల ప్రజలతో కలిసి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు నూతన ధర్మకర్తల మండలి కృషి చేస్తుందన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, హరీశ్రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నూతనంగా ఎన్నికైన చైర్మన్తోపాటు ధర్మకర్తలను చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాలకు చెందిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సుంకరి మల్లేశం, ఎంపీపీలు ఉల్లంపల్లి కరుణాకర్, తలారి కీర్తన కిషన్, జడ్పీటీసీ సిలువేరు సిద్దప్ప, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.