శర్వానంద్, ప్రియాంకా అరుళ్ మోహన్ ప్రధాన పాత్రలలో కిషోర్ తెరకెక్కించిన చిత్రం శ్రీకారం. శివరాత్రి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ సంపాదించుకుంది. సేద్యం చేయడం మనందరి బాధ్యత. అధునాతన వ్యవసాయం చేసి రైతుకు అండగా ఉందాం అంటూ శర్వానంద్ శ్రీకారం చిత్రం ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన వెంకయ్య నాయుడు..‘ఆత్మవిశ్వాసంతో అన్నదాత ముందుకు వెళ్ళవచ్చనే చక్కని సందేశం ‘శ్రీకారం’ చిత్రం ద్వారా అందించారని.. యువత చూడాల్సిన సినిమా శ్రీకారం అని కొనియాడారు.
‘వ్యవసాయ పునర్వైభవం కోసం గ్రామాలకు మరలండి అనే స్ఫూర్తిని యువతలో రేకెత్తించే విధంగా తెరకెక్కించిన ‘శ్రీకారం’ చక్కని చిత్రం. కుటుంబం, ఊరు అందరూ కలిసి ఉంటే సాధించలేనిది ఏదీ లేదనే చక్కని సందేశాన్ని అందించిన చిత్ర దర్శక నిర్మాతలు, నటీనటులకు శుభాకాంక్షలు.అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని గ్రామాలకు అందించి, వ్యవసాయంతో జోడించి, పరస్పర సహకారంతో ఆత్మవిశ్వాసంతో అన్నదాత ముందుకు వెళ్ళవచ్చు అన్న సందేశాన్ని శ్రీకారం అందిస్తోంది. యువత చూడదగిన చక్కని చిత్రం శ్రీకారం’ అంటూ వరుస ట్వీట్స్ చేశారు వెంకయ్య నాయుడు. వెంకయ్య నాయుడు ట్వీట్స్పై హీరో శర్వానంద్ స్పందిస్తూ ధన్యవాదాలు తెలుపారు.