నల్లగొండ : నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 31 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఎండ తీవ్రత నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్లు, మంచినీటి సౌకర్యం కల్పించారు అధికారులు. పోలింగ్ కేంద్రాల వద్ద కొవిడ్ నిబంధనలు అమలు చేస్తున్నారు. మాస్కు ధరించిన వారిని మాత్రమే ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లకు చేతులకు పోలీసులు గ్లౌసులు పంపిణీ చేస్తున్నారు.
మొత్తం 346 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొవిడ్ రోగులకు సాయంత్రం 6 గంటల ఓటేసేందుకు అనుమతి ఇవ్వనున్నారు. సాగర్ ఉప ఎన్నిక బరిలో మొత్తం 41 మంది అభ్యర్థులు ఉన్నారు.