నల్లగొండ : నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ రాత్రి 7 గంటలకు ముగియనుంది. ఇవాళ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, మధ్యాహ్నం 3 గంటల వరకు 69 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఎండ కాస్త తగ్గడంతో పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు చేరుకుంటున్నారు. సాయంత్రం 6 గంటల వరకు సాధారణ ఓటర్లకు అనుమతి ఇస్తారు. అప్పటి వరకు క్యూలైన్లలో నిల్చున్న వారికి ఓటేసేందుకు అనుమతిస్తారు. ఇక 6 గంటల తర్వాత కొవిడ్ బాధితులకు ఓటేసేందుకు అవకాశం ఇవ్వనున్నారు.
సాగర్లో రాష్ర్ట ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ ఇవాళ మధ్యాహ్నం పర్యటించారు. పైలాన్ కాలనీ, హిల్ కాలనీలో పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు, సరళిని పరిశీలించి, ఓటర్ల మనోభావాలను తెలుసుకున్నారు.
మొత్తం 346 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొవిడ్ రోగులకు సాయంత్రం 6 గంటల ఓటేసేందుకు అనుమతి ఇవ్వనున్నారు. సాగర్ ఉప ఎన్నిక బరిలో మొత్తం 41 మంది అభ్యర్థులు ఉన్నారు.