హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): ఒక్కసారి ప్రతినబూనితే విజయ తీరాన్ని ముద్దాడేదాకా విశ్రమించబోమని టీఆర్ఎస్ శ్రేణులు మరోసారి నిరూపించాయి. రెండింటికి రెండు ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకొని నూతనోత్సాహాన్ని సొంతం చేసుకున్నాయి. తెలంగాణభవన్ నుంచి మొదలైన సంబురాలు యావత్ తెలంగాణ అంతటా విస్తరించాయి. టీఆర్ఎస్ కార్యకర్తలకు ఈ గెలుపు వేయి ఏనుగుల బలాన్నిచ్చింది. ఇదే ఊపుతో.. ఇదే కార్యాచరణతో త్వరలో జరుగబోయే నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానాన్ని, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఖమ్మం, సిద్దిపేట మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు మరో నాలుగు మున్సిపాలిటీల ఎన్నికల్లోనూ గులాబీ జెండాను ఎగురవేస్తామనే ధీమాతో ఉన్నాయి. దుబ్బాక ఉప ఎన్నికల్లో మూడు అంకెల సంఖ్యతో గెలిచి.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గతం కంటే కొన్ని డివిజన్లు అదనంగా గెలుచుకున్న బీజేపీ అడ్డూ అదుపులేకుండా వ్యవహరించిన తీరు పట్ల టీఆర్ఎస్ శ్రేణులు సహనాన్ని ప్రదర్శించాయి.
సహనాన్ని పరిహాసంచేస్తూ బీజేపీ రెచ్చిపోయింది. అదేపనిగా అబద్ధాలను, అసత్యాలను ప్రచారంచేస్తూ ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించింది. ఈ పరిస్థితి ఇట్లాగే కొనసాగనివ్వకూడదని పార్టీ అధినేత కేసీఆర్ మొదలుకొని కిందిస్థాయి కార్యకర్త వరకూ పట్టుదలతో వ్యవహరించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ నుంచి ఎస్ వాణీదేవి, వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల స్థానాల నుంచి పల్లా రాజేశ్వర్రెడ్డి గెలుపులో తాముండాల్సిందేనని గులాబీ శ్రేణులు నిర్ణయించుకున్నాయి. అందుకు అనుగుణమైన కార్యాచరణను రూపొందించుకొని ముందుకుసాగాయి. ఉద్యమ సమయంలో పరకాల ఉప ఎన్నిక, రాష్ట్ర ఆవిర్భావం అనంతరం వచ్చిన వరంగల్ లోక్సభ ఉప ఎన్నికలను ఎంత ప్రతిష్ఠాత్మకంగా టీఆర్ఎస్ భావించిందో ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలను అంతే ప్రాణప్రతిష్టగా స్వీకరించాయి. రెండు చోట్ల విజయబావుటా ఎగురవేశాయి.