చండీగఢ్ : కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కరోనా వైరస్ కట్టడికి రూపొందిన దేశీ వ్యాక్సిన్ కొవాగ్జిన్ను తిరస్కరిస్తున్నాయని బీజేపీ చేసిన ఆరోపణలను పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ తోసిపుచ్చారు. ఇది పూర్తిగా అవాస్తవమని, రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న దుష్ప్రచారమని వ్యాఖ్యానించారు. కెప్టెన్ సింగ్ మొహాలిలోని సివిల్ ఆస్పత్రిలో శుక్రవారం కొవిడ్-19 వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న అనంతరం మీడియాతో ముచ్చటించారు.
పంజాబ్ సహా విపక్ష పాలిత రాష్ట్రాలు వ్యాక్సిన్పై సందేహాలతో వ్యాక్సినేషన్ను నిరాకరిస్తున్నాయని బీజేపీ ప్రతినిధి సంబిట్ పాత్ర వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. వ్యాక్సినేషన్పై ప్రజల్లో ఉన్న భయాన్ని పోగొట్టి అవగాహన కల్పించేలా మీడియా చొరవ చూపాలని కోరారు. కరోనా మహమ్మారి ఇంకా వెంటాడుతోందని ప్రజలు మాస్క్లు ధరించి కరోనా మార్గదర్శకాలను అనుసరించాలని అమరీందర్ సింగ్ కోరారు.