పెద్దేముల్, జూన్ 24 : ఆర్టీసీ కార్గో బస్సుల్లో అంగన్వాడీ కేంద్రాలకు సరకులను సరఫరా చేయడం సంతోషకరమని తాండూరు అంగన్వాడీ సీడీపీవో రేణుక, అంగన్వాడీ సూపర్ వైజర్ యాదమ్మ అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఆర్టీసీ కార్గో బస్సు ద్వారా ఆయా అంగన్వాడీ కేంద్రాలకు మంచినూనె ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తాండూరు అంగన్వాడీ సీడీపీవో రేణుక, అంగన్వాడీ సూపర్ వైజర్ యాదమ్మ మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్టీసీ కార్గో బస్సుల ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు సరకులను సరఫరా చేయడంతో రవాణా ఇబ్బందులు తొలగిపోయాయన్నారు. మొత్తం 59 అంగన్వాడీ కేంద్రాల్లో మొత్తం 1473 మంది 3 నుంచి 5 సంవత్సరాలలోపు చిన్న పిల్లలు, 782 మంది గర్భిణీ, బాలింతలకు మంచినూనె ప్యాకెట్లను పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ కార్గో బస్సు డ్రైవర్లు బండారి లింగయ్య, వెంకన్న, ఎల్.శంకర్ నాయక్, ఆయా గ్రామాల అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.