తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం
హైదరాబాద్, జూలై29 (నమస్తే తెలంగాణ): కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ చట్ట విరుద్ధంగా ఉన్నదని, బోర్డులకు అపరిమిత అధికారాలను కట్టబెట్టిందని తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం మండిపడింది. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు సంఘం నేతలు ఓ లేఖను రాశారు. సాగునీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్కు మంగళవారం ఆ లేఖను అందజేశారు. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరుపకుండా, మరోవైపు ట్రిబ్యునల్ అవార్డు రాకముందే బోర్డులను కేంద్రం నోటిఫై చేయడాన్ని ఇంజినీర్ల సంఘం దుయ్యబట్టింది. గెజిట్ మూలంగా ఇరిగేషన్శాఖలు నిర్వీర్యం అవుతాయని ఆందోళన వ్యకం చేసింది. రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రులు, లేదంటే ఇరు రాష్ర్టాల ప్రతినిధులు చర్చల ద్వారా వివాదాస్పద అంశాలపై ఓ అంగీకారానికి రావాలని, ట్రిబ్యునల్లో తేలేవరకు ఆ ప్రకారం కొనసాగాలని సూచించింది. అక్కడ పరిష్కారం కాకుంటే గెజిట్ నోటిఫికేషన్పై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని తెలిపింది.