హుజురాబాద్ : అక్టోబర్ 3న జమ్మికుంటలోని కొత్త వ్యవసాయ మార్కెట్ ఆవరణలో తెలంగాణ మున్నూరు కాపుసంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున “మున్నూరుకాపుల ఆత్మీయ సమ్మేళన సభ” నిర్వహించనున్నట్లు ఆహ్వాన కమిటీ చైర్మన్ వద్దిరాజు రవిచంద్ర వెల్లడించారు. హుజరాబాద్ లోని సిటీ సెంటర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రవి చంద్రతో పాటు రాష్ట్ర కో-కన్వీనర్ చల్లా హరి శంకర్, సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు కొండ దేవయ్య, విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మున్నూరు కాపుల అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు.
హైదరాబాద్ మేయర్ పదవిని రెండుసార్లు మున్నూరు కాపులకు ఇచ్చారని, అలాగే ఆర్టీసీ చైర్మన్ పదవి కూడా రెండుసార్లు మున్నూరు కాపులకు ఇచ్చి తమకు ఎంతో గౌరవం ఇచ్చారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆర్టీసీ చైర్మన్ పదవికి అన్ని విధాలా అర్హుడని, ఆయన రైతు బిడ్డ అని, ఆ పదవికి హుందాతనాన్ని తీసుకు వస్తారని అన్నారు.
అక్టోబర్ 3వ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు జమ్మికుంటలోని కొత్త వ్యవసాయ మార్కెట్ ఆవరణలో మున్నూరు కాపు సంఘం సభ నిర్వహించి పెద్ద ఎత్తున కాపు సోదరులను, మహిళలను, యువత, విద్యార్థులను సమీకరించి బాజిరెడ్డి గోవర్ధన్ కు సన్మానం చేయనున్నట్లు వారు వెల్లడించారు. ఈ సమావేశంలో మున్నూరు కాపు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నలుబాల రవీందర్, జిల్లా ఉపాధ్యక్షులు కర్ర రాజశేఖర్, జమ్మికుంట కౌన్సిలర్, హుజురాబాద్ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ పొనగంటి రామయ్య, హుజురాబాద్ కౌన్సిలర్లు తోట రాజేంద్ర ప్రసాద్, కల్లేపల్లి రమాదేవి, ప్రతాప మంజుల తదితరులు పాల్గొన్నారు.