హుజూరాబాద్, సెప్టెంబర్ 28: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని కొత్త వ్యవసాయ మారెట్ ఆవరణలో అక్టోబర్ 3న మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్టు ఆత్మీయ సమ్మేళనం ఆహ్వాన కమిటీ చైర్మన్ వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. మంగళవారం హుజూరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ మున్నూరు కాపుల అభివృద్ధి, సంక్షేమానికి ఎంతో కృషి చేస్తున్నారని, రాజకీయ రంగంలో ఎనలేని ప్రాధాన్యతను కల్పించారని, ఆయనకు ఎల్లవేళలా రుణపడి ఉంటామన్నారు. హైదరాబాద్ మేయర్ పదవిని రెండుసార్లు మున్నూరు కాపులకు ఇచ్చారని, ఆర్టీసీ చైర్మన్ పదవి కూడా రెండుసార్లు మున్నూరు కాపులకు ఇచ్చి తమను ఎంతో గౌరవించిన విషయాన్ని గుర్తుచేశారు. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆర్టీసీ చైర్మన్ పదవికి అన్ని విధాలా అర్హుడని, ఆయన ఆ పదవికి హూందాతనాన్ని తీసుకువస్తారని పేర్కొన్నారు. 3వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ఆత్మీయ సమ్మేళనం ప్రారంభమవుతుందని, కాపు సోదరులు, మహిళలు, యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమ్మేళనంలో భాగంగా బాజిరెడ్డి గోవర్ధన్ను సన్మానిస్తామన్నారు. ఈ సమ్మేళనానికి మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి హాజరు కానున్నారని తెలిపారు. మీడియా సమావేశంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కన్వీనర్ పుటం పురుషోత్తంరావు, రాష్ట్ర కోకన్వీనర్ చల్లా హరిశంకర్, సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కొండ దేవయ్య పాల్గొన్నారు.