హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): కరోనా వ్యాప్తి నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యంపై మున్సిపల్శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఏరోజు చెత్తను ఆ రోజు సేకరించడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే అదనపు వాహనాలు సమకూర్చుకోవాలని అధికారులను ఆదేశించింది. అన్ని మున్సిపాలిటీల్లో పేరుకుపోయిన చెత్త, మున్సిపల్ వ్యర్థాలను వెంటనే తొలగించాలని సూచించింది. బస్టాండ్లు, మార్కెట్లు, రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రతిరోజూ సోడియం హైపోక్లోరైట్ ద్రావకాన్ని విస్తృతంగా స్ప్రే చేయాలని సూచించింది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనాపై సమీక్ష సందర్భంగా పట్టణాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్ర మున్సిపల్శాఖ డైరెక్టర్ సత్యనారాయణ అధికారులకు పలు సూచనలిచ్చారు. కరోనా కేసులతోపాటు పారిశుద్ధ్యం సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కరోనా, ఇతర కారణాలతో మరణించినవారి దహన సంస్కారాలు నిర్వహించే శ్మశాన వాటికల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని, నీరు, విద్యుత్ సరఫరా నిరంతరం ఉండేవిధంగా చూడాలని మున్సిపల్ కమిషనర్లకు సూచించారు.