సూర్యాపేట, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): పెసరలకు సూర్యాపేట మార్కెట్లో బుధవా రం రాష్ట్రం మొత్తం మీద అత్యధిక ధర లభించింది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు మించి వ్యాపారులు కొనుగోళ్లు చేశారు. గరిష్ఠంగా క్వింటా పెసరల ధర రూ.7,549 పలికింది. ఇది మద్ద తు ధర 7,275 కంటే రూ.274 అధికం. తిరుమలగిరి మార్కెట్లో గరిష్ఠంగా రూ.7,090, కే సముద్రంలో రూ.6,321, వరంగల్లో 5,965, ఖమ్మంలో రూ.5,800 చొప్పున పెసరల కొనుగోళ్లు జరిగినట్టు సమాచారం. కందుల విషయంలోనూ ఇదే జోష్ కనిపించింది. క్వింటా కందులకు మద్దతు ధర రూ.6,300 కాగా సూర్యాపేటలో రూ.6,674 పలికింది. ఈనామ్ విధానాన్ని పకడ్బందీగా అమలుచేయడం వల్ల రైతులకు మంచి ధర లభిస్తున్నదని సూర్యాపేట మార్కెట్ చైర్మన్ ఉప్పల లలితాఆనంద్, కార్యదర్శి ఫసీఉల్లా పేర్కొన్నారు.
నాకు మూడెకరాలుంది. ఎకరంలో పెసర, రెండెకరాల్లో వరి, పత్తి వేసిన. పత్తి పాడైపోయింది. వరి అంతంత మాత్రంగానే ఉన్నది. పెసలు రెండున్నర క్వింటాళ్లు పండినై. సూర్యాపేట మార్కెట్కు తెస్తే క్వింటాకు రూ.7,549 చొప్పున వచ్చింది. ఇంత ధర నాకు వరి, పత్తిపైన ఏనాడూ రాలేదు. ప్రతిసారీ పెసర లేదా కంది పంటలపైనే డబ్బులు బాగా వస్తున్నాయి. వచ్చేసారి ఈ రెండు పంటలే వేద్దామనుకుంటున్నా.
సామ సుమతమ్మ, మిడ్తనపల్లి, ఆత్మకూర్ ఎస్ మండలం, సూర్యాపేట జిల్లా