కరోనాతో ప్రాణనష్టం జరుగకుండా చర్యలు తీసుకోవాలి
ఐసొలేషన్ కేంద్రాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి
గుండాల, ఆళ్లపల్లి పర్యటనలో భద్రాద్రి కలెక్టర్ అనుదీప్
బాధితులను ఐసొలేషన్కు పంపాలి: ఖమ్మం కలెక్టర్
గుండాల/ ఆళ్లపల్లి, జూన్ 4: అజాగ్రత్త, నిర్లక్ష్యం కారణంగానే కరోనా ముప్పు పొంచి ఉందని భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ అన్నారు. ప్రాణనష్టం జరుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. తొలుత గుండాల మండలంలో సమీకృత గిరిజన బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. పేటవాగు, పడుగోనిగూడెం, ముత్తాపురం గ్రామాల్లో కరోనా బాధితులకు అందుతున్న వైద్య సేవల గురించి, వైరస్ వ్యాప్తికి గల కారణాల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఐసొలేషన్ కేంద్రాల్లో చికిత్సకు కావాల్సిన మందులు, ఆక్సిజన్ పరికరాలు అన్ని సమృద్ధిగా ఉండాలని సూచించారు. గ్రామస్థాయిలో వైరస్ సోకిన వ్యక్తుల సమగ్ర సమాచారం.. సర్పంచుల కు, కార్యదర్శులకు పక్కాగా తెలిసి ఉంటుందని అన్నా రు. అలాంటి వారిని వెంట నే ఐసొలేషన్ కేంద్రాలకు తరలించి వైరస్ వ్యాప్తిని నిరోధించాలని సూచించారు. అనంతరం మటంలంక గ్రామ రహదారి పరిశీలించారు. పేటవాగు, ఇసుకవాగులపై వంతెనల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం పడుగోనిగూడెం, ముత్తాపురం గ్రామాల్లో పర్యటించి కరోనా వ్యాప్తికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పడుగోనిగూడెంలో కరోనా బాధితులను వివరాల గురించి వాకబు చేశారు. కరోనాతో మృతిచెందిన ఊకె రంగయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే ముత్తాపురంలో కరోనాతో బాధపడుతున్న పూనెం సమ్మక్క ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. గుండాల పీహెచ్సీలో ఐదు ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉంచాలని వైద్యాధికారిని ఆదేశించారు. కరోనా కేసులు పెరుగకుండా చర్యలు తీసుకోవాలని మండల అధికారులను ఆదేశించారు. ఎంపీడీవో అజ్రాత్ అలీ, జడ్పీటీసీ వాగబోయిన రామక్క, ఎంపీటీసీ ఎస్కే సంధాని, సర్పంచ్లు పూనెం సమ్మయ్య, కొటెం జయసుధ, ఉప సర్పంచ్ మానాల ఉపేందర్, వైద్యాధికారి మున్వర్ అలీ, ఏఓ అశోక్ పాల్గొన్నారు.
ఐసొలేషన్ కేంద్రాన్ని పరిశుభ్రంగా ఉంచాలి
గ్రామాల్లోని ఐసొలేషన్ కేంద్రాన్ని పరిశుభ్రంగా ఉంచాలని భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. ఆళ్లపల్లి మండలంలోని సమీకృత బాలికల వసతిగృహంలో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ కేంద్రాన్ని, పల్లె పకృతి వనం, నర్సరీలు, పీహెచ్సీ, ఎంపీడీఓ కార్యాలయాలను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీహెచ్సీ సిబ్బంది మండల కేంద్రంలోనే ఉంటూ సేవలందించాలని సూచించారు. ఐసొలేషన్ కేంద్రంలో కనీస సౌకర్యాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యవసర వైద్య సేవల కోసం ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. మండలంలో కరోనా లక్షణాలున్న 245 మందికి కిట్లు పంపీణీ చేశామని, వారిలో 158 మంది కోలుకున్నారని, మిగిలిన వారి ఆరోగ్యాన్ని ప్రతి రోజూ పరిశీలించాలని అన్నారు. మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తహసీల్దార్ సాధియా సుల్తానా, ఎంపీడీవో మంగమ్మ, వైద్యాధికారి సంధ్యారాణి పాల్గొన్నారు.