హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామ పంచాయతీలో పచ్చని అందాలకు కేంద్రం ఫిదా అయింది. పచ్చదనాన్ని పెంచడంలో పల్లెలకు ఆదర్శంగా నిలిచిందని కేంద్ర పంచాయతీరాజ్శాఖ ప్రశంసలు కురిపించింది. ముక్రా (కే) గ్రామంలో ఏర్పాటుచేసిన పల్లె ప్రకృతి వనం ఫొటోను శనివారం ట్విట్టర్లో పోస్ట్చేసింది. పచ్చదనాన్ని ఎలా పెంచాలో పల్లెలకు చూపిస్తూ ముక్రా (కే) మార్గదర్శకంగా నిలిచిందని పేర్కొన్నది. గ్రామీణ ప్రాంతాల్లో తగ్గిపోతున్న పచ్చదనాన్ని కాపాడుకునేందుకు పంచాయతీలు.. మొక్కలు నాటడంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించింది. కేంద్ర పంచాయతీరాజ్శాఖ అభినందనలపై రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ స్పందించారు. గ్రామంలో చేపట్టే ఒక మంచి పని ద్వారా ఏం సాధించవచ్చో ముక్రా(కే) గ్రామం చూపెట్టిందని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆ గ్రామ సర్పంచ్కు, ప్రజలకు అభినందనలు తెలిపారు. గ్రీన్ చాలెంజ్లో ఈ గ్రామం ఎప్పుడూ ముందే ఉన్నదని తెలిపారు. గ్రామ ప్రజల కృషిని, సాధించిన పురోగతిని గుర్తించినందుకు కేంద్ర పంచాయతీరాజ్కు ధన్యవాదాలు తెలిపారు.