ధర్మపురి : జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో శుక్రవారం మొహర్రం వేడుకలను ప్రజలు భక్తిశ్రద్దలతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు హిందూ, ముస్లింలు అధిక సంఖ్యలో హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతీ ఏటా నిర్వహించే విధంగా సంప్రదాయరీతిలో పీర్లు, నాల్సాబులను భక్తిశ్రద్దలతో పూనకాల మధ్య గోదావరి వరకు ఊరేగింపుగా వెళ్లి గోదావరిలో నిమజ్జనం చేశారు. పీర్లను చేతబట్టుకొని పూనకాల మధ్య నంది చౌక్ వద్ద గల అషూర్ఖానా ముందు ఏర్పాటు చేసిన అగ్ని గుండంలో నడిచారు. ధర్మపురి పట్టణంలోని నంది చౌక్, సారగమ్మవాడ, రహమత్పుర వీదుల్లోని అషూర్ఖానాల్లో(మసీదులు) నెలకొల్పిన పీరీలను డప్పుచప్పుళ్లు, సన్నాయి వాయిద్యాల మద్య సాయంత్రం వేళలో గోదావరి నదివద్దకు ఊరేగింపుగా వెళ్లి నదిలో నిమజ్జనం చేశారు. పీరీలకు, నాల్సాబులకు భక్తులు బత్తీసలు, మరమరాల దండలు, కుడుక బెల్లాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
ధర్మపురి పట్టణంలో యువకులు పులి, గొల్లభాయ, చీపురు దెయ్యం వేషాధారణలో సందడి చేశారు. పీరీల వద్ద మహిళలు చిన్నారులచే పూజాకార్యక్రమాలు నిర్వహించారు. వేడుకలను తిలకించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో రావడంతో నంది చౌక్ వద్ద జనసంద్రంగా మారింది. ఈ వేడుకల్లో ఆషూర్ఖానాల ముజావర్లు మహమూద్ఖాన్, దస్తగిరి, చాంద్, ఖాసీంఅలీ, ఇక్బాల్ పాల్గొన్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా సీఐ కోటేశ్వర్ మార్గదర్శకత్వంలో ఎస్ఐ కిరణ్కుమార్ ఆధ్యర్యంలో బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా భద్రత కల్పించారు.