హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎంఎస్ఎన్ లాబ్స్ కొవిడ్ చికిత్సలో వినియోగించే బారిసిటినిబ్ ఔషధం తయారీ, మార్కెటింగ్ కోసం అమెరికా కంపెనీ ఎలి లిల్లీతో లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆక్సిజన్ అవసరార్థం వెంటిలేషన్పై వున్న కొవిడ్ పేషంట్లకు రెమ్డెసివిర్తో పాటు బారిసిటినిబ్ ఇచ్చేందుకు భారత్ ఔషధ నియంత్రణా సంస్థ అత్యవసర అనుమతినిచ్చింది. ఎలి లిల్లీతో తమ కంపెనీ ఒప్పందం ఫలితంగా దేశంలో అందుబాటు ధరలో బారిసిటినిబ్ లభ్యత పెరుగుతుందని ఎంఎస్ఎన్ గ్రూప్ సీఎండీ ఎంఎస్ఎన్ రెడ్డి తెలిపారు. బారిసిటినిబ్కు యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ను (ఏపీఐ), ఫార్ములేషన్ను తమ ఆర్ అండ్ డీ, ఉత్పాదక యూనిట్లలో అభివృద్ధిపర్చినట్లు రెడ్డి వివరించారు. 2ఎంజీ, 4 ఎంజీలతో ‘బారిడోజ్’ బ్రాండ్నేమ్తో బారిసిటినిబ్ను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇదే డ్రగ్ తయారీ, మార్కెటింగ్కు ఎలి లిల్లీతో డాక్టర్ రెడ్డీస్ లాబ్ ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకోగా, తాజాగా టొరెంట్ ఫార్మా కూడా ఈ జాబితాలో చేరింది. వాస్తవానికి అర్థరైటిస్ చికిత్సలో వాడే బారిసిటినిబ్ను పలు దేశాల్లో కొవిడ్ చికిత్సకు అత్యవసర రోగులకు వినియోగించే అనుమతులు లభించాయి.