దళితుల అభివృద్ధి, సమగ్ర వికాసం కోసం, చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న ‘దళిత బంధు’ పథకం వారి జీవితాల్లో ఒక మైలురాయి. ఏ ప్రభుత్వమైనా తీసుకొచ్చే అభివృద్ధి నమూనా ఓట్లు, సీట్లకే పరిమితమవుతుంది. కానీ, కేసీఆర్ తన ప్రజారంజక పాలనలో ఆయా వర్గాల సర్వతోముఖాభివృద్ధి కోసం అహర్నిశలు కృషిచేస్తున్నారు. అందులో భాగమే ‘దళిత బంధు’ పథకం.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లవుతున్నది. రోజురోజుకు ప్రపంచ కుబేరుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. కానీ, దళితుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. దళితుల సామాజిక చైతన్యానికి విద్య ఆలంబనగా పనిచేస్తుంది. విద్య ద్వారానే సామాజిక మార్పు వేగంగా జరుగుతుందని అంబేద్కర్ భావించారు. కానీ, దళితుల విద్యాస్థాయి పది శాతం కూడా దాటలేదు. దళిత విద్యార్థులు మధ్యలోనే చదువులను ఆపేస్తున్నారు. ఫలితంగా వారి జీవితంలో రావాల్సిన మౌలిక మార్పులకు అనేక పరిమితులు ఏర్పడుతున్నాయి. వీటిని దాటాలంటే ‘దళిత బంధు’ పథకం దళితుల్లో విద్యా చైతన్యాన్ని తీసుకొచ్చేలా ఉండాలి. నాణ్యమైన విద్యను కొనసాగించడానికి కావాల్సిన ప్రాతిపదికను ప్రభుత్వం రూపొందించాలి.
దళితులు సాంస్కృతికంగా వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్నారు. ఏండ్ల తరబడి వర్ణ, కులవ్యవస్థ దళితుల్లో చొరవను దెబ్బతీసింది. గ్రామానికి, అంటరానిపల్లెకు మధ్య నిర్మాణమైన అంటరాని గోడలు దళితులను న్యూనతాభావానికి గురిచేశాయి. దళితులను సామూహిక సమూహాల్లో భాగం కాకుండా నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ అడ్డుతగిలింది. కాబట్టి ‘దళిత బంధు’ పథకాన్ని రూపొందించే క్రమంలో విధివిధానాల్లో ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది.
దళితులు కష్టపడి పనిచేసి జీవించడమే తప్ప, వారికి నికర ఆదాయం ఉండదు. ప్రభుత్వ ఉపాధిలో కూడా దళితుల శాతం చాలా తక్కువ. ప్రైవేట్రంగంలో దళితులకు చోటే లేదు. ఈ పదేండ్లలో దళిత సమాజం నుంచి చదువుకున్న యువత కొంతమేరకైనా ఎదిగొచ్చారు. కానీ, వారు కూడా నిరుద్యోగులుగానే మిగిలిపోయారు. కొందరైతే, చిరుద్యోగులుగా చాలీచాలని వేతనాలతో నెట్టుకొస్తున్నారు. ఫలితంగా సమాజాభివృద్ధిలో భాగం కావాల్సిన వారి శక్తి సామర్థ్యాలు నిరుపయోగమవుతున్నాయి. ‘దళిత బంధు’ను ప్రవేశపెట్టే సందర్భంలో సీఎం కేసీఆర్ ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
శూద్ర కులాల్లో కొన్నింటికి ఇంకా వృత్తులు కొనసాగుతున్నాయి. సీఎం కేసీఆర్ వారి జీవితాలకు భరోసా ఇచ్చి, భద్రత కల్పించారు. కానీ దళితులకు వృత్తి అనేది లేకుండాపోయింది. బడా పెట్టుబడిదారులు షూ కంపెనీలు పెట్టడం వల్ల చెప్పుల షాపులన్నీ కార్పొరేటీకరణ చెందాయి. దళితులు ఉపాధి కోల్పోయారు. డప్పు లేకుండా గ్రామాల్లో ఏ కార్యం జరుగదు. అంతటి ప్రాముఖ్యం కలిగిన డప్పుకు ఏ ఆధారం లేకుండా పోయింది. ఈ కారణాల వల్ల దళిత సమాజం తన అస్తిత్వాన్ని కోల్పోయే పరిస్థితికి చేరుకున్నది. ఈ నేపథ్యంలో ‘దళిత బంధు’ పథకం వస్తున్నది. సీఎం కేసీఆర్ తలుచుకుంటే ఏ పథకాన్నైనా విజయవంతం చేయగలుగుతారు. ఆయన అంతటి చిత్తశుద్ధి కలిగిన, పరిణతి చెందిన రాజకీయవేత్త. నీళ్లను తెలంగాణ బీళ్లలో పారించాలనుకున్నారు. ‘మిషన్ కాకతీయను’ రూపొందించి అమలుచేసి చూపారు. తెలంగాణ ప్రజల దాహార్తిని తీర్చాలనుకున్నారు. ‘మిషన్ భగీరథ’ను రూపొందించి ఇంటింటికీ నీళ్లు ఇచ్చారు. రైతుల కండ్లలో వెలుగును చూడాలనుకున్నారు. కాబట్టే ‘రైతు బంధు’ను ప్రవేశపెట్టి రైతులకు బంధువయ్యారు. ఇప్పుడు ‘దళిత బంధు’ను ప్రవేశపెడుతున్నారు, కచ్చితంగా దళితులకు పెద్ద దిక్కు అవుతారని విశ్వసిస్తున్నాం.