పంపిణీ చేసేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 10,464 మంది ఉపాధ్యాయులు
ఆదిలాబాద్ రూరల్/నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 13 :ప్రభుత్వ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ గుర్తింపు(ఐడీ) కార్డులు ఇవ్వాలని సర్కారు భావిస్తున్నది. ఈ మేరకు ఆరు నెలల క్రితమే టీచర్ల పూర్తి వివరాలను ప్రత్యేక వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. తాజాగా.. రాష్ట్ర విద్యాశాఖ మళ్లీ ఒకసారి సరిచూసి పంపాలని జిల్లా అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. అదేపనిలో యంత్రాంగం నిమగ్నమైంది. కాగా.. ఉమ్మడి జిల్లాలో 10,464 మంది టీచర్లు ఉండగా.. అందులో ఆదిలాబాద్లో 2,878, నిర్మల్లో 2,793, కుమ్రం భీం ఆసిఫాబాద్లో 1,976, మంచిర్యాల జిల్లాలో 2,847 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరందరికీ 13 అంశాలతో కూడిన ఐడీకార్డులు త్వరలో అధికారులు పంపిణీ చేయనున్నారు.
ప్రభుత్వ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు ఆరు నెలల క్రితమే ప్రత్యేక వెబ్సైట్లో జడ్పీ, ప్రభుత్వ, ఎయిడెడ్, కేజీబీవీలు, అర్బన్ రెసిడెన్షియల్, టీఎస్ మోడల్ స్కూల్స్, టీఆర్ఈఐఎస్ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్ల వివరాలు, ఫొటోలను అప్లోడ్ చేశారు. మళ్లీ ఒకసారి ఈనెల 24లోగా పూర్తి వివరాలు సరిచూసి రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయానికి సమాచారం అందించాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు ఉత్తర్వులు అందాయి. ఉ న్నతాధికారుల ఆదేశాల మేరకు కార్డులు ఇచ్చేందుకు విద్యాశాఖ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. ఉమ్మడి జిల్లాలో 10,464 మంది ఉపాధ్యాయులు పని చేస్తుండగా.. వీరికి త్వరలోనే గుర్తిం పు కార్డులు జారీ కానున్నాయి. వీటిలో ఎంప్లాయ్ ఐడీ, ఫొటో, పేరు, జెండర్, తండ్రి, భర్త పేరు, హోదా, పాఠశాల పేరు, బయోమెట్రిక్ ఐడీ నంబర్, పుట్టిన తేదీ, బ్లడ్ గ్రూప్, స్కూల్ అడ్రస్, స్కూల్ కోడ్, రెసిడెన్షియల్ అడ్రస్ ఇలా సుమారు 13 రకాల వివరాలు ఉండనున్నాయి. ఈ కార్డులు ఉపాధ్యాయులకు అనేక రకాలుగా ఉపయోగపడే అవకాశాలుంటాయని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో పని చేస్తున్న టీచర్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ఆదిలాబాద్ జిల్లాలో..
జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో సుమారు 2,878 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. జీహెచ్ఎంలు 56, స్కూల్ అసిస్టెంట్లు 898, లాంగ్వేజ్ పండిత్లు 236, ఎల్ఎఫ్ఎల్హెచ్ఎంలు 59, ఎస్జీటీలు 1,340, వ్యాయామ ఉపాధ్యాయులు 29, ఏఎస్ పీడీలు 17, క్రాఫ్ట్, మ్యూజిక్, డ్రాయింగ్ ఉపాధ్యాయులు 46, కేజీబీవీ, అర్బన్ రెసిడెన్షియల్లలో 197 మంది ఉన్నారు.
నిర్మల్ జిల్లాలో..
నిర్మల్ జిల్లాలో 2,793 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఇందు లో ఉన్నత పాఠశాల హెచ్ఎంలు 54, స్కూల్ అసిస్టెంట్లు 887, భాషా పండితులు 212, ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంలు 37, ఎస్జీటీలు 1,327, పీఈటీలు 38, స్కూల్ అసిస్టెంట్ పీఈటీలు 17, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్లు 20, కేజీబీవీ టీచర్లు 201 మంది పని చేస్తున్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో..
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 1,946 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో ఉన్నత పాఠశాలల హెచ్ఎంలు 24, స్కూల్ అసిస్టెంట్లు 453, భాషా పండితులు 148, ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంలు 26, ఎస్జీటీలు 1,115, పీఈటీలు 16, స్కూల్ అసిస్టెంట్ పీఈటీలు 9, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్లు 14, కేజీబీవీ ఉపాధ్యాయులు 141 మంది ఉన్నారు.
మంచిర్యాల జిల్లాలో..
మంచిర్యాల జిల్లాలో 2,847 మంది పని చేస్తున్నారు. ఇందులో ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు 70, స్కూల్ అసిస్టెంట్లు 966, భాషా పండితులు 242, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు 42, ఎస్జీటీలు 1,238, పీఈటీలు 41, స్కూల్ అసిస్టెంట్ పీఈటీలు 15, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్లు 33, కేజీబీవీ ఉపాధ్యాయులు 200 మంది విధులు నిర్వహిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
అంత తక్కువ ధరకు మా వ్యాక్సిన్ అమ్మలేం: ఆర్డీఐఎఫ్
అరుదైన బ్లడ్ క్లాట్.. జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ నిలిపేసిన అమెరికా
పని ఎక్కువ అవుతున్నదంటూ ఆరోగ్య శాఖ మంత్రి రాజీనామా
టిబెట్ సరిహద్దుల్లో 5 జీ నెట్వర్క్ విస్తరిస్తున్న చైనా