హైదరాబాద్, మే11 (నమస్తే తెలంగాణ): కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వార్డు సభ్యులు, సర్పంచ్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఉప ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్ధసారధి తెలిపారు. ఈ మేరకు అన్ని జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీచేశారు. మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో పంచాయతీరాజ్శాఖలో ఏర్పడిన ఖాళీల భర్తీకి నిర్వహించాల్సిన ఉప ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. ఖాళీ స్థానాలకు సంబంధించిన ఓటర్ల జాబితా ప్రచురణ, పోలింగ్ కేంద్రాల గుర్తింపు తదితర ప్రక్రియలను ఇప్పటికే పూర్తిచేసినప్పటికీ, ప్రజాక్షేమం దృష్ట్యా ఉప ఎన్నికలను వాయిదా వేయాలని నిర్ణయించినట్టు ఎన్నికల కమిషనర్ తెలిపారు. పరిస్థితులు కుదుటపడిన తరువాత వైద్యారోగ్యశాఖ అధికారులతో సంప్రదించి, ప్రభుత్వ అనుమతితో తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్కుమార్, ఓఎస్డీ జయసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.