హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్తో రాష్ట్ర ఎంపీలు భేటీ అయ్యారు. టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు నేతృత్వంలో రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డి, లోక్సభ సభ్యులు కొత్త ప్రభాకర్రెడ్డి, బీబీ పాటిల్, వెంకటేశ్ నేతకాని శనివారం ఢిల్లీలో సీఎం కేసీఆర్ నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రగతిపై చర్చించారు. రాష్ట్రంలో సాగువిస్తీర్ణం గణనీయంగా పెరిగి పంట దిగుబడులు రికార్డు స్థాయిలో రావడంతో రైతులకు అండగా నిలవడం, కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన హక్కులపై సమాలోచన జరిపారు. ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల తెలంగాణ రైతాంగం నష్టపోకూడదని, ఈ విషయమై సంబంధిత కేంద్ర మంత్రులతో నిరంతరం సంప్రదింపులు జరిపి రాష్ట్ర పరిస్థితిని వివరించాలని ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర మంత్రులకు తాను నివేదించిన అంశాలపై ఫాలోఅప్ చేయాలని సూచించారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా నేతలతో కలిసి కేంద్ర జల్శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ను కలిసిన సీఎం కేసీఆర్.. ఆదివారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిర్వహించే ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొననున్నారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ కేంద్ర పౌరసరఫరాలశాఖ మంత్రి పీయూష్గోయల్ను కలిసే అవకాశం ఉన్నది.