ఎంసీహెచ్లో పండంటి బిడ్డకు జననం
రామడుగు, ఏప్రిల్ 28: సర్కారు దవాఖానల్లో ప్రసవాలు చేయించుకోవాలని చెప్పడమే కాదు ఆచరించి చూపారు కరీంనగర్ జిల్లా రామడుగు ఎంపీపీ కలిగేటి కవిత. సోమవారం కరీంనగర్లోని మాతాశిశు కేంద్రంలో పండంటి బాబుకు జన్మనిచ్చి ఆదర్శంగా నిలిచారు. బుధవారం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ దవాఖానలపై ప్రజలకు నమ్మకం కలిగించేందుకే తాను ఎంసీహెచ్లో ప్రసవం చేయించుకున్నానని చెప్పారు. ప్రతినెలా ఇక్కడే పరీక్షలు చేయించుకున్నానని పేర్కొన్నారు. ఎంసీహెచ్లో వసతులు, సిబ్బంది అందించిన సేవలు బాగున్నాయని ప్రశంసించారు. తాను, బాబు క్షేమంగా ఉన్నామని.. సీఎం కేసీఆర్ కృషితో సర్కారు దవాఖానల్లో కార్పొరేట్ వైద్యం అందుతున్నదని కొనియాడారు.