హైదరాబాద్ : అమెరికాలో జరిగే ఒక సదస్సుకు హాజరుకావాల్సి ఉందని.. ఈ మేరకు తనకు ఆహ్వానం అందిందని.. తనపై జారీయైన లుక్ఔట్ నోటీసుపై అత్యవసర విచారణ చేపట్టాల్సిందిగా కోరుతూ ఎంపీ సుజనా చౌదరి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై విచారణ సందర్భంగా పిటిషన్లో ఆహ్వాన పత్రిక ఎందుకు సమర్పించలేదని హైకోర్టు ప్రశ్నించింది. ఆహ్వానం లేకుండా అత్యవసరంగా విచారణ చేయలేమని చెప్పింది.
రుణాలు తీసుకుని దుర్వినియోగం చేయడమే కాకుండా బ్యాంకుల్ని మోసం చేశారని సీబీఐ నమోదు చేసిన అభియోగాల కేసులో ఇమిగ్రేషన్ కమిషనర్ జారీ చేసిన లుక్ఔట్ నోటీసులను రద్దు చేయాలనే అత్యవసర పిటిషన్ను న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ మంగళవారం విచారించారు. రూ.71.46 కోట్ల మేరకు బ్యాంకుల్ని మోసం చేశారనే అభియోగాలపై విద్యుత్ పరికరాల తయారీ పరిశ్రమ బెస్ట్ అండ్ క్రాఫ్టన్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్పై సీబీఐ, ఈడీలు వేర్వేరుగా కేసులు నమోదు చేశాయి.
ఈ కేసులో సుజనా చౌదరికి ప్రమేయం ఉందని 2019 జూన్ 18న లుక్ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. తనకే సంబంధం లేదని వినతిపత్రం ఇచ్చినా ఫలితంలేదని, లుక్ఔట్ నోటీసు రద్దు చేయాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఆహ్వాన పత్రిక అందజేస్తామని న్యాయవాది చెప్పడంతో కేసు విచారణ జూలై 7కి హైకోర్టు వాయిదా వేసింది.