అహ్మదాబాద్: టెస్టు సిరీస్లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని పట్టుదలగా ఉన్న ఇంగ్లండ్ టి20 సిరీస్ ఆరంభ మ్యాచ్లో కసితీరా భారత్ను ఓడించింది. తొలుత బ్యాటింగ్లో, పిదప బౌలింగ్లో అనుకున్న స్థాయిలో రాణించలేకపోయిన భారత్ 5 మ్యాచ్ల టి20 సిరీస్ను ఓటమితో ప్రారంభించింది.
మొతేరా స్టేడియంలో శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ 8 వికెట్లతో తేడాతో భారత్పై గెలుపొంది శుభారంభం చేసింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 124 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (48 బంతుల్లో 67; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీతో సత్తా చాటగా… మిగతా వారంతా పెద్దగా పరుగులు చేయలేకపోయారు. రిషభ్ పంత్ (23 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్), హార్దిక్ పాండ్యా (21 బంతుల్లో 19; 1 ఫోర్, 1సిక్స్) రాణించారు. ఓపెనర్లు శిఖర్ ధావన్ (4), రాహుల్ (1), కెప్టెన్ విరాట్ కోహ్లి (0) విఫలమయ్యారు. ప్రత్యర్థి బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు దక్కించుకున్నాడు. మార్క్వుడ్, బెన్ స్టోక్స్, ఆదిల్ రషీద్, క్రిస్ జోర్డాన్ తలా ఓ వికెట్ తీశారు.
అనంతరం 125 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఆడుతూపాడుతూ ఛేదించింది. మరో 27 బంతులు మిగిలి ఉండగానే (15.3 ఓవర్లు) కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 130 పరుగులు చేసింది. తొలుత ఓపెనర్లు జేసన్ రాయ్ (32 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్స్ర్ల), జోస్ బట్లర్ (24 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్) ఇంగ్లండ్ విజయానికి బాట వేశారు. వీరిద్దరూ తొలి వికెట్కు 72 పరుగులు జోడించారు. అనంతరం డేవిడ్ మలాన్ (20 బంతుల్లో 24 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), జానీ బెయిర్ స్టో (17 బంతుల్లో 26 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) మిగతా లాంఛనాన్ని పూర్తి చేశారు. వీరిద్దరూ మూడో వికెట్కు అజేయంగా 28 బంతుల్లో 41 పరుగులు జోడించారు. చహల్, సుందర్ చెరో వికెట్ తీశారు.