ప్రతి వెయ్యి మందికి ముగ్గురు సిబ్బంది..
మొదటి రోజు కామారెడ్డి జిల్లాలో 62,161..
నిజామాబాద్ జిల్లాలో 56,403 ఇండ్లల్లో సర్వే పూర్తి
నిజామాబాద్లో 1203, కామారెడ్డిలో 802 బృందాలు
కొవిడ్ లక్షణాలున్న వారికి ఐసొలేషన్ కిట్ల అందజేత
చికిత్స అవసరమైన వారిని దవాఖానకు తరలింపు
వర్షాన్ని సైతంలెక్కచేయకుండా సర్వేలో పాల్గొన్న కలెక్టర్ శరత్
విద్యానగర్/ఖలీల్వాడి, మే 6 : కరోనా వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా ఇంటింటి జ్వర సర్వే ఉమ్మడి జిల్లాలో గురువారం ప్రారంభమైంది. ప్రతి ఇంటికి వెళ్లి సర్వే నిర్వహించనున్న వైద్య సిబ్బంది కొవిడ్ లక్షణాలు ఉన్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారిని మెరుగైన చికిత్స కోసం దవాఖానకు తరలించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. ఈ మేరకు ప్రతి వెయ్యి మంది జనాభాకు ముగ్గురు సభ్యుల బృందాన్ని సర్వే కోసం కేటాయించారు. సర్వే బృందాల్లో ఏఎన్ఎం, ఆశ వర్కర్లు, పంచాయతీ, రెవెన్యూ, అంగన్వాడీ కార్యకర్తలు, ఐకేపీ, మెప్మా సిబ్బంది తదితరులు ఉన్నారు. ఇంటింటికీ వెళ్లిన సర్వే బృందాలు ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి, కొవిడ్ లక్షణాలు ఉన్నవారికి అవసరమైన మందులు అందజేశారు. నాలుగురోజులైనా లక్షణాలు తగ్గని వారిని దగ్గరలోని కొవిడ్ కేంద్రానికి తరలించి చికిత్స అందించనున్నారు.
హోం ఐసొలేషన్ అవసరమైనవారికి వెంటనే హెల్త్ కిట్లు అందజేసి బాధితులు మా మూలుస్థితికి వచ్చే వరకు వైద్యాధికారులు పర్యవేక్షిస్తారు. దవాఖానలో అవసరమైన వారికి రెమ్డెసివిర్ ఇంజక్షన్లు, మందులు అందజేస్తారు. సర్వేలో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తున్నారు. జ్వర సర్వే ఫలితంగా కరోనా వ్యాప్తిని కట్టడి చేయవచ్చని ప్రభు త్వం భావిస్తున్నది. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానలతోపాటు పీహెచ్సీలు, యూపీహెచ్సీలు 44 సెంటర్లలోని సిబ్బందిని జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేసింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఓపీ సేవలు అందుబాటులో ఉండేలా అన్ని ఏర్పాట్లు చేశారు. కామారెడ్డి జిల్లాలో అత్యవసర వైద్య సేవల కోసం 73829 29350, 73829 28649 హెల్ప్లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు.
కామారెడ్డి జిల్లాలో..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇంటింటికీ జ్వర సర్వేలో భాగంగా మొదటిరోజైన గురువారం కామారెడ్డి జిల్లాలో 802 బృందాలు 62 వేల 161 ఇండ్లల్లో సర్వే నిర్వహించాయి. 1553 మందికి ఐసొలేషన్ కిట్లను అందజేశాయి. దేవునిపల్లిలోని పలు వార్డుల్లో కలెక్టర్ శరత్ ఇంటింటి సర్వేను పర్యవేక్షించారు. వైద్యాధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. కొవిడ్ లక్షణాలు ఉన్న వారికి మందులు అందజేయాలని, చికిత్స అవసరమైన వారిని దవాఖానకు తరలించాలని సూచించారు. ఓ వైపు వర్షం కురుస్తున్నా ఆయన సర్వేను పర్యవేక్షించారు. కలెక్టర్ వెంట డీఎంహెచ్వో చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ దేవేందర్, మెడికల్ ఆఫీసర్లు సుజాయత్ అలీ, సుస్మితరాయ్ తదితరులు ఉన్నారు.
నిజామాబాద్ జిల్లాలో..
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 1203 బృం దాలు 56,403 ఇండ్లల్లో సర్వే నిర్వహించాయి. 1828 మందికి కొవిడ్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించి ఐసొలేషన్ కిట్లు అందజేశాయి.
ఆదిలోనే అరికట్టేలా..
ఆదిలోనే కరోనా వ్యాప్తిని కట్టడి చేయడమే ఇంటింటి జ్వర సర్వే ముఖ్య ఉద్దేశం. కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్న వారిని గుర్తించి వారికి ఐసొలేషన్ కిట్లు అందజేయనున్నారు. చికిత్స అవసరమైన వారిని సర్వే బృందాలు దవాఖానలకు తరలించనున్నాయి. కొవిడ్ లక్షణాలు ఉన్నప్పటికీ ఆలస్యంగా దవాఖానలకు వస్తుండడంతో బాధితుల ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తున్నది. ఇంటింటికీ జ్వరసర్వే ద్వారా ప్రాథమిక దశలోనే బాధితులను గుర్తించడం ద్వారా వారికి చికిత్స అందించడంతోపాటు ఆదిలోనే వైరస్ వ్యాప్తిని కట్టడి చేయవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.