మేడ్చల్ మల్కాజ్గిరి : కీసర రిజర్వు ఫారెస్టులోని నూర్ మహమ్మద్ కుంటలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, మంత్రి మల్లారెడ్డితో కలిసి అంకురార్పణ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సంతోష్ కుమార్ ఇవాళ మొదటి మొక్కను నాటారు.
మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా జులై 24, 2019లో కీసర రిజర్వు ఫారెస్టును ఎంపీ సంతోష్ కుమార్ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.
ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. కీసర రిజర్వు ఫారెస్ట్లో రూ. 3 కోట్లతో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. రామలింగేశ్వరస్వామి ఆలయం సమీపంలో ఉన్న అడవిని అభివృద్ధి చేస్తామన్నారు. కీసరగుట్ట అడవి చుట్టూ ఫెన్సింగ్ వేయడం జరిగిందని, రానున్న రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అని పేర్కొన్నారు. అడవి పునరుద్ధరణలో భాగంగా పెద్దమొత్తంలో మొక్కలు నాటడం జరుగుతుంది అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, అటవీశాఖ పీసీఎఫ్ శోభ, పర్యాటకశాఖ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, కీసర సర్పంచ్ మాధురి వెంకటేష్, ఇతర ప్రజాప్రతినిధులు నాయకులు, వివిధశాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.