కరీంనగర్, జూన్ 16 (నమస్తే తెలంగాణ)/బోయినపల్లి: ‘మా తాతకు నేనంటే చాలా ఇష్టం. అమితంగా ప్రేమించేవారు. ప్రతిసారి వేసవి సెలవుల్లో నన్ను తీసుకొచ్చేవారు’ అంటూ మంత్రి కేటీఆర్ తన అమ్మమ్మ గ్రామమైన బోయినపల్లి మండలం కొదురుపాకలో పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. బుధవారం కొదురుపాకలో తన అమ్మమ్మ, తాతయ్య జోగినపల్లి లక్ష్మమ్మ- కేశవరావు స్మారకార్థం నిర్మించిన రైతు వేదికను మేనమామ శ్రీనివాస్రావు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించిన కేటీఆర్ గ్రామంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన మాటల్లోనే.. ‘కరీంనగర్ నుంచి సిరిసిల్ల, సిరిసిల్ల నుంచి కరీంనగర్కు వెళ్లే ఏ సందర్భంలోనైనా కొదురుపాకకు రాగానే మనసు ఇటువైపు లాగేస్తది. చిన్నప్పటి జ్ఞాపకాలు సినిమా రీల్లాగా గిర్రున తిరుగుతాయి. మా తాత కేశవరావుతో తిరిగిన జ్ఞాపకాలు గుర్తుకువస్తాయి. అప్పుడు ఇక్కడకు రావాలంటే సర్వీసులే ఉండేవి. స్టేజీ వద్ద దిగితే రిక్షాలు ఉంటే వాటిపై వచ్చేది. అవికూడా అందుబాటులో లేకుంటే ఎన్నోసార్లు నడిచినజ్ఞాపకం ఉంది. మా తాత నన్ను అమితంగా ప్రేమించెటోళ్లు. ఆయనకు మా అమ్మ పెద్దకూతురు. నేను అందరి కన్నా పెద్ద మనవడ్ని. అందుకే మా తాత నన్ను బాగా చూసుకునేవాళ్లు. మా తాతను నేను ఎంతో ప్రేమించెటోన్ని. దురదృష్టవశాత్తు మా తాత చనిపోయినపుడు నేను అమెరికాలో ఉండి రాలేకపోయా. ఈ రోజు మా తాత, అమ్మమ్మ ఎక్కడున్నా వారి ఆత్మ శాంతించేలా, వారిపేరు శాశ్వతంగా నిలిచేలా వారి జ్ఞాపకార్థం రైతువేదికను నిర్మించా. మా అమ్మమ్మ, తాతయ్య జ్ఞాపకార్థం కొదురుపాక గ్రామస్తులు ఈ చిన్ని కానుకను స్వీకరించి పూర్తిగా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్న’ అని మంత్రి కేటీఆర్ అన్నారు.