హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): కృష్ణానదీ జలాల కేటాయింపుల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని సహించబోమని లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీ రంజిత్రెడ్డి హెచ్చరించారు. రాష్ర్టానికి జరిగిన అన్యాయాన్ని కేంద్రమే సరిదిద్దాలని, కృష్ణా జలాల పునఃపంపిణీ కోసం కొత్త ట్రిబ్యునల్ను ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. కొత్త ట్రిబ్యునల్ అవార్డు వచ్చేవరకు కృష్ణా జలాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు 50:50 నిష్పత్తిలో వినియోగించుకునేలా నోటిఫికేషన్ జారీచేయాలని కోరారు. మంగళవారం ఆయన పార్లమెంట్ జీరో అవర్లో కృష్ణానది జలాల కేటాయింపును ప్రస్తావించారు. కొత్త రాష్ర్టాలు ఏర్పడినప్పుడు నదీ పరీవాహక ప్రాంతాల ఆధారంగా నీటి కేటాయింపులు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు.
గత నెలలో కృష్ణానదీ యాజమాన్యబోర్డు చేసిన నీటి కేటాయింపుల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు. 69 శాతం పరివాహక ప్రాంతం ఉన్న తెలంగాణకు 299 టీఎంసీలు, 31 శాతం పరివాహక ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్కు 512 టీఎంసీలు కేటాయించడమేమిటని ప్రశ్నించారు. తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటాను ఏపీకి తరలించడంలో ఆంతర్యమేమిటని నిలదీశారు. రాష్ర్టానికి న్యాయం చేస్తామని కేంద్ర జల్శక్తి మంత్రిత్వశాఖ హామీ ఇవ్వడంతో సుప్రీంకోర్టులో వేసిన కేసును ఉపసంహరించుకున్నామని, చివరకు కేఆర్ఎంబీ రూపంలో తీవ్ర అన్యాయం చేశారని పేర్కొన్నారు.