హైదరాబాద్: గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ‘ఊరు ఊరికో జమ్మి చెట్టు.. గుడి గుడికో జమ్మి చెట్టు’ కార్యక్రమానికి అపూర్వ స్పందన వస్తున్నది. తన పుట్టిన రోజు సందర్భంగా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
శనివారం ఉదయం చేవెళ్లలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి జమ్మి చెట్టు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ పిలుపుమేరకు ప్రతి ఏడాది తన పుట్టినరోజున మొక్కలు నాటుతున్నానని చెప్పారు.
ఈ ఏడాది ఊరు ఊరుకో జమ్మి చెట్టు- గుడిగుడికో జమ్మి చెట్టు కార్యక్రమంలో భాగంగా జమ్మి చెట్టు నాటడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర వృక్షమైన జమ్మి చెట్టు ప్రతి ఊరిలో, ప్రతి గుడిలో ఉండాలనే ఉద్దేశంతో ఎంపీ సంతోష్ చేపట్టిన ఈ కార్యక్రమం అద్భుతమన్నారు.